calender_icon.png 18 August, 2025 | 5:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షూటింగులు తీయనీయకపోతే అడుక్కు తింటారు.. దర్శకుడు వీఎన్ ఆదిత్య వ్యాఖ్యలు

18-08-2025 03:33:49 PM

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో నెలకొన్న పరిస్థితి అందరికీ తెలిసిందే. 30 శాతం వేతనాలు పెంచాలంటూ సినీకార్మికులు పట్టు పడుతున్నారు. పని విధానంలో తమ ప్రతిపాదనలు అమలు చేయడానికి అంగీకరిస్తే.. అప్పుడు వేతనాల గురించి మాట్లాడతామని నిర్మాతలు మెట్టు దిగకుండా ఉన్నారు. ఈ విషయంలో చర్చలు కొనసాగుతున్నాయి. మరోవైపు అగ్రనటుడు చిరంజీవి ఇరువర్గాల మధ్య సయోధ్య కూర్చే బాధ్యత తీసుకున్నారు. ఇందులో భాగంగా మెగాస్టార్ నిన్న నిర్మాతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈరోజు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులతో మాట్లాడనున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత వీఎన్ ఆదిత్య ప్రస్తుత పరిస్థితులపై స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. షూటింగులు తీయనీయకపోతే అడుక్కుతినే పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు. 

"ఒక్క వ్యక్తి సినిమాల్లోకి వచ్చి, డబ్బులొస్తేనే తీస్తాను,  రాకపోతే వేరే వ్యాపారం లో పెడతాను అనుకోకుండా,  లాభమొచ్చినా సినిమాలే తీస్తూ,  నష్టమొచ్చినా సినిమాలే తీస్తూ తన బయటి వ్యాపారాలలో వచ్చిన లాభాలు కూడా సినిమా రంగం మీదకే మళ్లిస్తూ ఈ రంగం లో పదేళ్ల లో దాదాపు వెయ్యికోట్ల పైగా పెట్టుబడి పెట్టుకుని, ఫ్లాపుల్ని,  ట్రోలింగులని ఎదురీదుతూ మొండిగా తట్టుకుని నిలబడితే.. ఆయన్ని ఎంకరేజ్ చేసి మరిన్ని మంచి సినిమాలు చేసేలా ప్రోత్సహించాల్సింది పోయి,  అబద్ధపు ప్రచారాలతో, స్వార్ధపూరిత రాజకీయాలతో,  కుల వివక్షలతో ఈ రంగం మీద పెట్టుబడిని బయటి రంగాలకి మళ్లించేలా మన ప్రవర్తన ఉంటే ఎవడికిరా నష్టం.. యాభై సినిమాలకు రెండొందల మందికి పైగా పదేళ్ల లో ఆయన పెట్టిన మూడు పూటల భోజనం ఖర్చు మాత్రమే ఒక పది పెద్ద సినిమాల బడ్జెట్టు.. కారు డ్రైవర్లకి,  ప్రొడక్షన్ బాయ్స్ కి డబ్బులెగ్గొట్టి,  హీరో, హీరోయన్స్ కి మాత్రమే డబ్బులిచ్చి, బడా ప్రొడ్యూసర్స్ లా మార్కెట్ లో పోజు కొట్టే చాలామందిని ఒక్క మాట అనలేని యూనియన్ లీడర్లు ఈయన మీద మాత్రం విరుచుకు పడిపోతారు..

ఏ కార్మిక సంఘం అయినా వర్కర్ కి అన్యాయం చేసిన ప్రొడ్యూసర్ పై పడాలి.. వేలమంది వర్కర్స్ కి పని కల్పించే ప్రొడ్యూసర్స్ మీద కాదు.. ఈ సమ్మె వల్ల కడుపులు కాలుతున్న కార్మికులు లక్షల్లో ఉన్నారు తెలుగు ఇండస్ట్రీ లో.. వాళ్ల ఆకలి బాధలకు ఏ యూనియన్ నాయకుడు సమాధానం చెప్తాడు.. కళారంగంలో పని దొరకడమే మొదటి ప్రాధాన్యత.. దానిని ఆపే సంఘాలు ఉన్నా ఒకటే.. ఊడినా ఒకటే.. చేతనైతే యూనియన్లు అన్నీ కలిసి ఒక్క రోజు షూటింగ్ జరిగేందుకు దోహదపడాలి.. ఆపడానిక్కాదు.. ఎన్నుకున్న నాయకులు షూటింగులకు అంతరాయం కలగకుండా సమస్యలకు పరిష్కారం తేవాలి అది సామర్ధ్యం అంటే.. పనుంటే గాని డబ్బు,  అన్నం దొరకని పరిశ్రమలో పని ఆపి, ఎవ్వరూ ఎవ్వరినీ ఉద్ధరించలేరు..

నేను ఏ  యూనియన్ లో అయినా సాధారణ సభ్యుడినే గానీ, ఏ పదవిలోనూ ప్రస్తుతం లేను.. అయినా నాకేం తెలుసని ఈ పోస్ట్ పెట్టానని ఎవరైనా అనుకుంటే.. ముప్ఫై అయిదేళ్లుగా సినిమా రంగంలో వస్తున్న ప్రతి మార్పు కి ప్రత్యక్ష సాక్షి ని నేను.. నా అనుభవాన్ని మించిన అర్హత లేదు అని కచ్చితంగా చెప్పగలను.. రెండు శాతం సక్సెస్ రేటున్న రంగానికి ఇన్వెస్ట్ మెంట్లు తెప్పించడం చాలా కష్టం.. 2008 సంవత్సరం నుంచి నా ద్వారా వచ్చిన పెట్టుబడులు రెండు వేల కోట్లు.. రాబోయే పెట్టుబడులు మరో వేయి కోట్ల పైనే.. నా వల్ల వచ్చిన గౌరవం ముప్ఫై రెండు జాతీయ,అంతర్జాతీయ స్థాయి పురస్కారాలు.. ఇంతకన్నా అర్హత కావాలా మాట్లాడడానికి..?  నిర్మాతల్ని సినిమాలు తీయనివ్వండి.. కార్మికులు బావుంటారు.. షూటింగులు ఆపకండి. అడుక్కు తినాల్సి వస్తుంది.. సినిమా అనేది పని చేసేవాడికి మాత్రమే పరమాన్నం పెడుతుంది.. పని లేని రోజున పస్తులు పడుకో పెడుతుంది.. ఇది తెలుసుకుని మసలుకోండి" అంటూ రాసుకొచ్చారు డైరెక్టర్ వీఎన్ ఆదిత్య.