22-06-2025 10:31:09 AM
మహబూబాబాద్, (విజయక్రాంతి): ముందు మురిపించిన వరుణుడు అదను సమయంలో కరుణించకపోవడంతో పత్తి పంటకు విపత్తుగా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జూన్ నెలలో కురవాల్సిన సాధారణ వర్షపాతంతో పోలిస్తే లోటు వర్షపాతం నమోదయ్యింది. ఇప్పటివరకు మహబూబాబాద్(Mahabubabad district) జిల్లాలో 100.1 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా ఇప్పటివరకు 27.1 మిల్లి మీటర్ల వర్షం మాత్రమే కురిసింది. ఇదే పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కూడా నెలకొంది. నైరుతి రుతుపవనాలు ముందుగానే వస్తాయని, ఆశించిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ(Meteorological Department) తొలుత అంచనా వేయగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో అందుకు భిన్నంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.
మే నెలలో రోహిణి కార్తె లోనే ముందస్తు వర్షాలు మురిపించడంతో చాలాచోట్ల రైతులు పత్తి, పసుపు సాగు చేపట్టారు. అయితే విత్తనాలు సగానికి పైగా విస్తీర్ణంలో నాటక ఇప్పుడు వరుణుడు ముఖం చాటేయడంతో అధిక విస్తీర్ణంలో నాటిన పత్తి విత్తనాలు(Cotton seeds) ఆశించిన స్థాయిలో మొలకెత్తలేదు. కొన్నిచోట్ల మొలకెత్తినప్పటికీ వర్షాభావ పరిస్థితులతో, సాగునీరు అందించే పరిస్థితి లేక అంకురంలోనే మాడిపోయాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధికంగా వర్షాధారిత పంటగా పత్తి సాగు చేయడం ఆనవాయితీగా వస్తుంది. దీనితో తొలకరి వర్షాలతో మురిసిపోయిన రైతులు సాగు చేసిన పత్తి పంటలు ఎండిపోతుండడంతో పెట్టుబడి కోల్పోయి, మళ్లీ వర్షాలు కురిస్తే సాగు చేయడానికి అవసరమైన విత్తనాలను సమకూర్చుకోవడం కష్టంగా మారిందని చెబుతున్నారు.
మహబూబాబాద్ జిల్లాలో ఈ వానాకాలంలో 2,21,282 ఎకరాల్లో వరి, 84,854 ఎకరాల్లో పత్తి, 58,361 ఎకరాల్లో మొక్కజొన్న, 52,249 ఎకరాల్లో మిర్చి, 463 ఎకరాల్లో పసుపు, 4,555 ఎకరాల్లో పెసర, 35,000 ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందుకోసం అవసరమైన విత్తనాలను సిద్ధంగా ఉంచింది. పత్తి సాగుకు అవసరమైన 1,13,306 విత్తన ప్యాకెట్లను సిద్ధం చేయగా ఇప్పటికే సాధారణ సాగు విస్తీర్ణంలో సగం వరకు పత్తి సాగు కోసం విత్తనం నాటినట్లు అంచనా వేస్తున్నారు. ఇందులో సగం విస్తీర్ణం లో నాటిన పత్తి వర్షాభావ పరిస్థితిలో కారణంగా మొలక దశలోనే ఎండలకు మగ్గిపోయిందని, ఫలితంగా ఎకరం పత్తి పంట సాగుకు సుమారు 5వేల రూపాయల వరకు ఖర్చు చేశామని, వర్షాలు కురిస్తే మళ్లీ విత్తనం నాటాల్సిన పరిస్థితి ఉందని, ఈసారి వాడాకాలం పంటల సాగు ఆదిలోనే ఆర్థికంగా నష్టంగా మారిందని చెబుతున్నారు.
పెరిగిన విద్యుత్ డిమాండ్
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వానాకాలం పంటల సాగు చేపట్టిన రైతులు వ్యవసాయ బావులపైనే ఆధారపడుతున్నారు. వానకాలం సాగు చేసిన పంటలు రక్షణ కోసం బావుల్లో నీటిని తోడి పంటలను తడుపుతున్నారు. దీనితో జూన్ నెలలో వర్షాలతో గణనీయంగా తగ్గాల్సిన విద్యుత్ వినియోగం అందుకు భిన్నంగా విపరీతంగా పెరిగిపోయిందని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎక్కడ చూసినా రైతులు నాటిన పత్తి, పసుపు, మొక్కజొన్న పంటలకు బావుల ద్వారా వ్యవసాయ మోటార్లతో నీటి తడులు పెట్టే పనిలో నిమగ్నమయ్యారు. దీనితో జిల్లా వ్యాప్తంగా విద్యుత్ కు డిమాండ్ విపరీతంగా పెరిగిందని, సబ్ స్టేషన్లు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లపై లోడ్ పెరిగి లో - వోల్టేజీ సమస్య కూడా పెరిగిందని చెబుతున్నారు.