17-06-2025 12:12:28 AM
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి, జూన్ 16 ( విజయక్రాంతి ) : ప్రభుత్వ పాలనలో పాఠశాలల్లో విద్యార్థులకు వెంటనే పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తుల పంపిణీ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో విద్యా శాఖ అధికారులు, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తుల పంపిణీ పై సమీక్ష నిర్వహించారు.
ఈ రోజు వరకు ఎంతమంది విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించారు, ఎంతమంది విద్యార్థులకు ఏకరూప దుస్తులు అందించారు అనే వివరాల పై సమీక్ష నిర్వహించారు. స్పందించిన కలెక్టర్ పాఠశాల వారిగా నిర్ణిత ప్రొఫార్మలో పూర్తి నివేదికను ఇవ్వాలని విద్యా శాఖ అధికారిని ఆదేశించారు. పదవ తరగతిలో ప్రవేశించిన విద్యార్థులకు మ్యాథమాటిక్ సబ్జెక్టులో విద్యా సామర్థ్య పరీక్ష నిర్వహించేందుకు ప్రణాళికలు పూర్తి చేయాలని ఆదేశించారు.
విద్యార్థుల విద్యా సామర్థ్యం తెలుసుకునేందుకు మ్యాథమాటిక్ సబ్జెక్టు ఫోరమ్ అధ్యాపకుల ద్వారా ప్రత్యేకంగా రూపొందించిన ప్రశ్న పత్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. నాలుగు సెట్ల ప్రశ్న పత్రం తయారు చేయాలని, ఈ వారంలో పరీక్షల నిర్వహణ మార్కులు ప్రకటించడం పూర్తి చేసి పరీక్షలో కనీస మార్కులు సంపాందించని విద్యార్థులకు నెల రోజుల పాటు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలని ఆదేశించారు.
పరీక్ష చాలా పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఈ విద్యా సంవత్సరంలో జిల్లా నుండి ఏ ఒక్క విద్యార్థి మేథమాటిక్ సబ్జెక్ట్ లో ఫెయిల్ కావడానికి వీలులేదని ఆదేశించారు. జిల్లా విద్యాశాఖ అధికారి మహమ్మద్ అబ్దుల్ ఘని, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామ్స్ గణేష్, పి డి ఆర్ డి ఓ ఉమాదేవి, సి.యం.ఓ యుగంధర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.