calender_icon.png 10 June, 2025 | 3:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

10 నుండి 17 వరకు అమ్మ మాట అంగన్వాడి బాట

09-06-2025 10:17:55 PM

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 10 నుండి 17 వరకు "అమ్మ మాట అంగన్వాడి బాట" కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి(District Collector Ila Tripathi) ఒక ప్రకటనలో ఆదేశించారు. ఈ సందర్భంగా 3 సంవత్సరాలలోపు పిల్లలను బడిలో చేర్పించే కార్యక్రమంలో గ్రామ పంచాయతీలు, గ్రామ ప్రజలను భాగస్వాములను చేయాలని తెలిపారు. ఈనెల 10న "అమ్మ మాట అంగన్వాడి బాట" ప్రారంభానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను చేయాలని ఆమె జిల్లా సంక్షేమ అధికారిని, అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులతో పాటు, గ్రామ పెద్దలు అందర్నీ భాగస్వాములను చేయాలని చెప్పారు.

అంగన్వాడీ ఆవరణలను శుభ్రంగా ఉంచుకోవడం, అనవసరమైన సామాగ్రిని తొలగించడం, చెత్తాచెదారం తీసేసి పిల్లలు సంతోషంగా అంగన్వాడీలో చేరేలా తల్లుల కమిటీలు, స్వయం సహాయక సంఘాలతో గ్రామంలో తిరగాలని, అంగన్వాడీ ద్వారా అందించే సేవల గురించి తెలియజేయాలన్నారు. రోజువారీ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ తెలియజేస్తూ 10న అంగన్వాడీలను అలంకరించాలని, తల్లిదండ్రులు పిల్లలతో సెల్ఫీ దిగడం, అంగన్వాడీ స్థాయిలో తల్లుల కమిటీలు, గ్రామైక్య సంఘాలు, మహిళా స్వయం సహాయక సంఘాలు, ప్రజా ప్రతినిధులను ఆహ్వానించి పండగ వాతావరణంలో కార్యక్రమాన్ని నిర్వహించాలని, 11వ తేదీన ఇల్లిల్లు తిరిగి పూర్వ పాఠశాల విద్య పిల్లలను గుర్తించి తల్లిదండ్రులకు పాఠశాల పూర్వ విద్య గురించి, అంగన్వాడీ కార్యక్రమాల గురించి,  కాలపట్టిక, అన్ని విషయాలను తెలియ చేయాలని, పిల్లల్ని అంగన్వాడీలో చేర్చుకోవాలని, పాఠశాల పూర్వ విద్య పూర్తిచేసిన పిల్లలకు సర్టిఫికెట్లు ప్రదానం చేయాలని, ఐదు సంవత్సరాల పైబడిన పిల్లల్ని ప్రాథమిక పాఠశాలలో చేర్పించాలని తెలిపారు. 

ఈ నెల 12 నుండి 16 వరకు అన్నీ అంగన్వాడీ కేంద్రాల పరిధిలో పోషన్ కిచెన్ గార్డెన్ ల అభివృద్ధి, పౌష్టికాహార ప్రాముఖ్యత తెలియజేయాలని, అభ్యసన కేంద్రాలకు గుర్తింపు, అందుకు తగ్గ మెటీరియల్ను సంసిద్ధం చేసుకోవడం, పిల్లల సంరక్షణ వంటివి చేపట్టాలన్నారు. ఈ నెల 17న సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించాలని, పాఠశాల పూర్వ విద్య ప్రాముఖ్యతను మరోసారి అందరికీ తెలియజేయాలని, ఇందుకు సంబంధించి అంగన్వాడీల ద్వారా అందించే పుస్తకాలు, అసెస్మెంట్ కార్డులు ప్రదర్శించాలని, తల్లిదండ్రులతో పాటు, తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు అందర్నీ పిలవాలని, గ్రామ పెద్దలను గ్రామంలోని ప్రజలను ఇందులో భాగస్వాములు చేయాలని, ఆరోగ్యంగా ఉన్న పిల్లల తల్లిదండ్రులకు అవార్డు ఇవ్వాలని, సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని చేపట్టాలని ఆమె ఆదేశించారు.