calender_icon.png 27 September, 2025 | 10:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్..

27-09-2025 09:22:33 PM

అదిలాబాద్ (విజయక్రాంతి): ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నెలకొల్పిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో నైపుణ్యంతో కూడిన శిక్షణ పొందడం ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని  జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అందుబాటులోకి తెచ్చిన 65 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను శనివారం హైదరాబాద్ లోని మల్లెపల్లి ఏ.టీ.సీ సెంటర్ నుండి మంత్రులు జి.వివేక్ వెంకటస్వామి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్ విధానం ద్వారా లాంచనంగా ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో భాగంగానే  జిల్లా కేంద్రంలోని  ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐ.టీ.ఐ) ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన  ఏ.టీ.సీ కేంద్రాలను కలెక్టర్  గ్రంథాలయ ఛైర్మెన్ మల్లెపూల నర్సయ్య,  గోవర్ధన్ రెడ్డి లతో కలిసి ప్రారంభించారు. ఏ.టీ.సీ కేంద్రాలలో వివిధ కోర్సులలో శిక్షణ అందించేందుకు వీలుగా నెలకొల్పిన ఆధునిక యంత్రాలను పరిశీలించారు.

ఈ మేరకు కలెక్టర్ మాట్లాడుతూ... ప్రస్తుత పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా, సరికొత్త సాంకేతికత అంశాలతో యువతలో నైపుణ్యాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఏ.టీ.సీ కేంద్రాలను ఏర్పాటు చేసిందని అన్నారు. అదే సమయంలో పారిశ్రామిక అవసరాలకు నైపుణ్యం కలిగిన అభ్యర్థులు అందుబాటులో ఉంటారని తెలిపారు.  ఏ.టీ.సీ సెంటర్ కు రూ. 4.70 కోట్ల నిధులను ఖర్చు చేశారని వివరించారు. మొదటి ఏడాది ఆరు కోర్సులలో శిక్షణ అందించడం జరుగుతోందని, క్రమక్రమంగా మార్కెట్ డిమాండ్ ఉన్న మరిన్ని ఆధునిక కోర్సులలో శిక్షణ అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని అన్నారు. టాటా కన్సల్టెన్సీ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుని ఏ.టీ.సీ కేంద్రాలలో శిక్షణ ఇప్పిస్తోందని, దీని వల్ల విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ప్లేస్ మెంట్  ఉంటుందని,  ఈ అవకాశాన్ని యువతీ, యువకులు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధి కల్పన అధికారి మిల్కా , ITI ప్రిన్సిపల్   శ్రీనివాస్, ముత్యం రెడ్డి, ఏ.టీ.సీ కేంద్రాల ప్రిన్సిపాల్, ఇన్ స్ట్రక్టర్లు, శిక్షణ పొందుతున్న అభ్యర్థులు , తదితరులు పాల్గొన్నారు.