26-07-2025 11:29:05 PM
కార్గిల్ అమరులకు నివాళులర్పించిన జిల్లా కలెక్టర్..
అదిలాబాద్ (విజయక్రాంతి): కార్గిల్ యుద్ధం భారత సైనికుల ధైర్యం, దేశభక్తికి అద్దం పడుతుందని, వారి త్యాగాల వల్లనే మనం నేడు ప్రశాంతంగా జీవించగలుగుతున్నమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా(District Collector Rajarshi Shah) అన్నారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఆవరణలోని కార్గిల్ పార్క్ లో శనివారం కార్గిల్ విజయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాజీ సైనికులు, ఎన్.సి.సి క్యాడేట్లు, స్థానిక ప్రజలతో కలిసి కార్గిల్ యుద్ధంలో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమర జవాన్ లకు అమరవీరుల స్థూపం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... ఆపరేషన్ విజయ్ పేరిట కార్గిల్ నుంచి యుద్ధభేరి మోగించి కార్గిల్ కొండల నుంచి శత్రుమూకలను తరిమికొట్టిన సందర్భంగా ప్రతీయేటా జులై 26న కార్గిల్ విజయ్ దివస్ను నిర్వహిస్తూన్నామని ఇవాళ్టితో కార్గిల్ విజయ్ దివస్కు సరిగ్గా 26 ఏళ్లు నిండాయన్నారు. యువత దేశసేవలో ముందుండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ స్రవంతి, మున్సిపల్ కమిషనర్ సీవియన్ రాజు, మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు శంకర్ దాస్, సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రి, పలువురు మాజీ సైనికులు, ఎన్.సి.సి క్యాడెట్లు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.