26-07-2025 11:32:45 PM
జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్..
ఎల్బీనగర్: వనస్థలిపురం డివిజన్లోని ఇంజనీర్స్ కాలనీ పార్క్ను కొందరు కబ్జాచేసి వినాయక మండపాలు కడుతున్నారని కాలనీ వాసులు ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో శనివారం జీహెచ్ఎంసీ ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్(Zonal Commissioner Hemanth Keshav Patil), కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి వనస్థలిపురం డివిజన్ ఇంజనీర్స్ కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్, డివిజన్లోని కాలనీ సంఘాల ప్రతినిధులతో కలిసి పార్కుని పరిశీలించారు. ఇంజనీర్స్ కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీ మహిళలు జోనల్కమిషనర్ తమ కాలనీలోని సమస్యలను వివరించారు. మల్లికార్జుననగర్ అసోసియేషన్ నాయకులు ప్రేమ్ కుమార్, నిరంజన్, ఆర్టీసీ కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ ముకుంద రాజు, క్రిస్టియన్ కాలనీ ప్రెసిడెంట్ హరీందర్ రెడ్డి, శక్తి నగర్ కాలనీవాసులు జోనల్ కమిషనర్ కు తమ కాలనీల పరిధిలోని సమస్యలను వివరించారు.
ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ మాట్లాడుతూ.. సమస్యలన్నింటినీ త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కబ్జాకు గురైన పార్కుని అతి త్వరలోనే పూర్తిస్థాయిలో పార్కుగా తీర్చిదిద్ది, అవైలబుల్ గా జిమ్ కూడా శాంక్షన్ చేయిస్తానని హామీ ఇచ్చారు. పార్కు స్థలం అన్యాక్రాంతం కాకుండా వెంటనే చర్యలు తీసుకుని, హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన కార్పొరేటర్ వెంకటేశ్వర్ రెడ్డికి ఈ సందర్భంగా కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్కమిటీ డైరెక్టర్ రామారావు, బీజేపీ నాయకుడు వాసు చౌదరి ఎల్బీనగర్ సర్కిల్డీసీ కె. మల్లికార్జున రావు, ఈఈ కార్తీక్, డీఈ ఎండీ రఫీ, ఏఈ విగ్నేశ్వరి, ఏఈ యూబీడీ మేనేజర్ శ్రీనివాస్, వర్క్ ఇన్స్పెక్టర్ రమేశ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.