గుడిసెవాసులకు న్యాయం చేయండి
సీఎం రేవంత్రెడ్డికి ఎమ్మెల్యే కూనంనేని విజ్ఞప్తి
హైదరాబాద్/అబ్దుల్లాపూర్మెట్, జూన్ 19 (విజయక్రాంతి) : రంగారెడ్డి జిల్లా అబ్బుల్లాపూర్మెట్ మండలం పరిధిలో రావి నారాయణరెడ్డి కాలని భూదాన భూమిలో గుడిసెలు వేసుకున్న పేదలకు న్యాయం చేయాలని సీపీఐ రాష్ట్రకార్యదర్శి, ఎమ్యెల్యే కూనంనేని సాంబశివరావు సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన సీఎంను సచివాలయంలో కలిసి వినతి పత్రం సమర్పించారు. ఏడాదిన్నరగా వారంతా ఎండావాన లెక్క చేయకుండా చిన్న పిల్లలతో జీవిస్తున్నారని, అందరూ పేద, మధ్య తరగతికి చెందిన వారే పేర్కొన్నారు. 400 మంది విద్యార్థులు అక్కడ నుంచే స్కూళ్లకు వెళుతున్నారని తెలిపారు. భూదాన భూమి పేదలకు చెందే విధంగా చూడాలని విద్యుత్, మంచినీటి సౌకర్యం కల్పించాలని కోరారు. తమ విజ్ఞప్తికి సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు సీపీఐ నాయకులు తెలిపారు. సీఎంను కలిసిన వారిలో రంగారెడ్డి జిల్లా సీపీఐ కార్యదర్శి పాలమాకుల జంగయ్య, పానుగంటి పర్వతాలు, ముత్యాల యాదిరెడ్డి తదితరులు ఉన్నారు.






