04-05-2025 12:00:00 AM
ఇద్దరు పిల్లల్ని పెంచేసరికి తల్లిదండ్రులు ఎక్కడలేని ఒత్తిడికి గురవుతారు. ’అమ్మో పిల్లల్ని పెంచడం మామూలు విషయం కాదు.. అంతకు మించిన టెన్షన్ మరొకటి లేదు‘ అంటూ స్టేట్ మెంట్లు ఇచ్చేస్తారు. నిజంగానే పిల్లల్ని పెంచడం అమ్మానాన్నల్లో అంత ఒత్తిడిని పెంచుతుందా అనే విషయంపై యేల్ యూనివర్సిటీ సుమారు నలభైవేలమందిపైన పరిశోధన చేసింది.
ఇందులో తేలిందేమిటంటే.. అందరూ అనుకున్నట్టుగా పిల్లలని పెంచడం అనేది తల్లిదండ్రుల్లో ఎటువంటి ఒత్తిడిని పెంచదు. వాళ్ల మెదడు వృద్ధాప్యం బారిన పడకుండా చురుగ్గా ఉండేందుకు తోడ్పడుతుందట. ఇందుకోసం ఎంపిక చేసుకున్న తల్లిదండ్రుల న్యూరో ఇమేజింగ్ డేటాని తీసుకుని పరిశీలించినప్పుడు.. ఒక సంతానం ఉన్న తల్లిదండ్రులతో పోలిస్తే ఇద్దరూ అంతకన్నా ఎక్కువ పిల్లలున్న వారి మెదడులోని కొన్ని కీలకమైన భాగాలు మరింత చురుగ్గా పనిచేయడం గమనించారు.
నిజానికి పిల్లలు పుట్టిన కొత్తల్లో తల్లుల్లో మతిమరుపు లక్షణాలు కనిపిస్తాయి. దీన్నే ’మమ్మీ బ్రెయిన్‘ అంటారు. అయితే ఈ పరిస్థితి తాత్కాలికమే అని.. ఆ తర్వాత పిల్లలు పెరిగేకొద్దీ ఆ సమస్యలన్నీ తగ్గిపోవడంతో పాటు మెదడు చురుగ్గా మారుతుందనీ ఈ పరిశోధనలో వెల్లడైంది.