3 April, 2026 | 6:53 PM

ఘనంగా దొడ్డి కొమురయ్య జయంతి

03-04-2026 05:06 PM

దమ్మపేట,(విజయక్రాంతి): శుక్రవారం దొడ్డి కొమరయ్య జయంతి సిఐటియు కార్యాలయంలో సిఐటియు మండల కన్వీనర్ మురహరి రఘు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రఘు మాట్లాడుతూ నాడు నైజాం పాలనకు వ్యతిరేకంగా భూమి కోసం భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం మట్టి మనుషులు సాగించిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్యన్నారు. నైజాం పాలనలో ప్రజలకు ఎటువంటి హక్కులు లేవని, అన్ని వర్గాల ప్రజల చేత వెట్టి చాకిరి చేయించే వారని అన్నారు. జమీందారులు, దేశముఖ్ ల ఆగడాలను ఆనాటి ప్రజా సమూహం భరించలేనంతగా తయారైందని, ఆంధ్ర మహాసభ ప్రజల్లో కల్పించిన చైతన్యంతో గ్రామ గ్రామాన ప్రజలు జమీందారుల ఆగడాలను వ్యతిరేకించారని అన్నారు.

ఈ క్రమంలో విసునూర్ రామచంద్ర రెడ్డి జమీందారికి వ్యతిరేకంగా జరిగిన ప్రదర్శనలో కడవెండి గ్రామ సంఘ నాయకుడు దొడ్డి కొమరయ్య భూస్వామి గుండాల తుపాకి తూటాలకు బలైనారని అన్నారు. దొడ్డి కొమరయ్య అమరత్వం తో ప్రజలు తుపాకులు చేపట్టి కమ్యూనిష్టుల నాయకత్వాన జమీందారులను, భూస్వాములను తరిమికొట్టి లక్షలాది ఎకరాల భూములను స్వాధీరపరచుకున్నారన్నారు.

ఈ పోరాటం ఫలితంగానే లక్షలాది ప్రజలు తమ జీవితంలో మొట్టమొదటిసారిగా రోజు రెండు పూటలా భోజనం చేయగలిగారని తెలిపారు. పాలకుల ఆడంబరమైన వాగ్దానాలతో భూ సమస్య ఎన్నటికీ పరిష్కారం కాదని ప్రజలు ఐక్యంగా, సంఘటితంగా, సమరశీల ప్రజా పోరాటం మాత్రమే భూ సమస్యను పరిష్కరించగలుగుతుందని దొడ్డి కొమరయ్య నమ్మిన ప్రజాపోరాటం చాటి చెప్పిందన్నారు. ఈ కార్యక్రమంలో హమాలి వర్కర్స్ యూనియన్ నాయకులు కోడూరు కృష్ణ, రామకృష్ణ, ఆదినారాయణ, శ్రీను, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.