23-10-2025 12:00:00 AM
ఎల్బీనగర్, అక్టోబర్ 22 : పోలీసులు విధి నిర్వహణలో ‘బేసిక్ పోలీసింగ్’ తప్పకుండా పాటించాలని ఎల్బీనగర్ డీసీపీ బి.అనురాధ అన్నారు. ‘ఫెయిర్, ఫర్మ్, ఫ్రెండ్లీ, ప్రొఫెషనల్ పోలీసింగ్’ ఫార్ములాతో పోలీస్ శాఖ ప్రతిష్ఠను మరింత పెంచేందుకు కృషి చేయాలని సూచించారు. బుధవారం హయత్నగర్ పోలీస్ స్టేషన్ను డీసీపీ సందర్శించారు. ఈ సందర్భంగా హయత్ నగర్ పోలీసుల పనితీరును పరిశీలించారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ.. ‘ఫెయిర్ పోలీసింగ్’ అంటే చట్టం ముందు అందరూ సమానమేనని, నిష్పాక్షికంగా వ్యవహరించాలన్నారు.
ప్రజల రక్షణయే ప్రధాన ధ్యేయంగా శాంతిభద్రతల నిర్వహణ కోసం ‘ఫర్మ్ పోలీసింగ్’, ప్రజల విశ్వాసాన్ని పొందడానికి ‘ఫ్రెండ్లీ పోలిసింగ్’ నిర్వహించాలని ఆదేశించారు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు వచ్చే పేదలు, మహిళలు, వృద్ధులతో మర్యాదగా వ్యవహరించాలని, వారికి న్యాయం చేసేందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. పోలీస్ వ్యవస్థలో ఏఐ లాంటి వినూత్న మార్పులు వచ్చినప్పటికీ నేరాల నియంత్రణలో బేసిక్ పోలీసింగ్ మరువొద్దు అన్నారు. సివిల్ తగాదాల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు. పెండింగ్ కేసుల మీద దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి, హయత్ నగర్ సీఐ నాగరాజు గౌడ్, డీఐ సంతోష్, అడ్మిన్ ఎస్సు లక్ష్మీనారాయణ, ఎస్సులు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.