15-07-2025 08:37:31 PM
మందమర్రి,(విజయక్రాంతి): వర్షాకాలంలో వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున వ్యాధుల బారి నుండి ప్రజలను కాపాడేందుకే డ్రైడే కార్యక్రమం చేపడుతున్నట్లు గ్రామ కార్యదర్శి ఎస్ హరీష్ తెలిపారు. మండలంలోని పొన్నారం గ్రామపంచాయతీలో డ్రైడే కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ పరిధిలోని పలు వార్డుల్లో పర్యటించి ఇంటి పరిసరాలలో నీరు నిల్వ ఉండటం మూలంగా కలిగే అనర్థాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. నీరు నిల్వ ఉండడం మూలంగా దోమలు వ్యాప్తి చెంది విష జ్వరాలు ప్రబలే ప్రమాదం ఉందని దీనిని దృష్టిలో పెట్టుకొని గ్రామస్తులు తమ ఇంటి పరిసరాలలో మురుగు కాలువల్లో నీరు నిలువ లేకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ సంఘం జిల్లా అధ్యక్షుడు ఈద లింగయ్య, వేల్పుల శ్రీనివాస్, ఆశా వర్కర్ మాసు సుజాత లు పాల్గొన్నారు.