ఓటెత్తిన పట్టభద్రులు
వరంగల్లో పోలింగ్ కేంద్రాలను బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న సందర్శించి ఓటింగ్ సరళిని పరిశీలించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్రెడ్డి హనుమకొండలోని పింగళి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సూర్యాపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్రెడ్డి, మఠంపల్లి మండల కేంద్రంలో నల్లగొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి, వరంగల్ కాశీబుగ్గలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, నల్లగొండలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ దాసరి హరిచందన, హనుమకొండ తేజస్వీ పాఠశాలలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జనగామలోని ప్రిస్టన్ కళాశాలలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, వరంగల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ , భద్రాచలంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కొత్తగూడెంలో ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, యాదగిరి గుట్ట మండల కేంద్రంలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, దమ్మపేటలో అశ్వారావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ ఓటింగ్లో పాల్గొన్నారు.
ప్రశాంతంగా పోలింగ్..
నల్లగొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 12 జిల్లాల పరిధిలోని మొత్తం 34 అసెంబ్లీ స్థానాల్లో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. ఎన్నికలకు సహకరించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు. ఎన్నికల సిబ్బంది, పోలీసుల సహకారంతోనే ఎన్నిక విజయవంతమైంది.
-దాసరి హరిచందన,
ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నల్లగొండ కలెక్టర్






