09-06-2025 01:06:38 AM
కామారెడ్డి, జూన్ 8 (విజయ క్రాంతి): తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం పరిధి పేటలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్య రంగం లో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలబెట్టబోతున్నారని తెలిపారు. విద్యపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. డీఎస్సీ ప్రకటించి పదివేల మంది పైగా ఉపాధ్యాయులను నియమించామని తెలిపారు. విద్య, వైద్య రంగాల్లో ప్రక్షాళనకు విప్లవాత్మక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉందని మేము విశ్వసించామని పేర్కొన్నారు.
ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు పెంచేందుకు విద్యా కమిషన్ ను నియమించామని తెలిపారు. మెరుగైన విద్య వ్యవస్థ ఏర్పాటుకు సమగ్ర విధానాన్ని రూపొందించాలని కమిషన్ను ఆదేశించామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో కూడా ప్రీస్కూల్ విధానం తీసుకొచ్చి ఆలోచన చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ గురుకులాలు, హాస్టల్స్లో మెస్ చార్జీల సమస్యను పరిష్కరించామన్నారు.
గతంలో ఎప్పుడు లేని విధంగా డైట్ చార్జీలను 40 శాతం, కాస్మోటిక్ చార్జీలను 200 శాతం పెంచామన్నారు. ఎస్సీ, ఎస్ టి బీసీ మైనార్టీ విద్యార్థులంతా ఒకే ప్రాంగణంలో చదువుకునేలా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నమన్నారు. తొలి దశలోని రూ. 11600 కోట్లతో 58 యంగ్ ఇండియా ఏజెన్సీ స్కూల్స్ నిర్మాణం చేపట్టామ న్నారు. జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కర్ మాట్లాడుతూ విద్య అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుండి కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించిందన్నారు.
గత ప్రభుత్వలు ప్రైవేటు విద్యాసంస్థలతో చేతులు కలుపుకుని ప్రభుత్వ విద్యాసంస్థలను బ్రష్టు పట్టించాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్య పై ప్రత్యేక దృష్టి సారించి విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి ముందుకు తీసుకెళ్తున్నా మన్నారు.
విద్యాలయాల అభివృద్ధికి తన వంతు కృషి కూడా చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో రేరా కమిషనర్ పూర్వ కలెక్టర్ సత్యనారాయణ, ప్రముఖ పారిశ్రామికవేత్త జనగామ సుభాష్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పల్లె రమేష్ గౌడ్, వడ్ల శంకర్, జీడిపల్లి నరసింహారెడ్డి, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.