09-06-2025 01:06:06 AM
సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు
పటాన్ చెరు, జూన్ 8 : జూలై 9న జరిగే దేశ వ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు కోరారు. ఆదివారం గడ్డపోతారం-ఖాజీపల్లి పారిశ్రామిక వాడలోని టీఐడీసీ పరిశ్రమలోని సీఐటీయూ కార్మికులతో జరిగిన సమావేశానికి చుక్క రాములు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నాలుగు లేబర్ కోడ్ ల రద్దు కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.
సీఐటీయూ కార్మికుల పక్షాన పోరాడుతుందన్నారు. 1991లో సరళీకృత ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా సీఐటీయూ దేశవ్యాప్తంగా ఉద్యమాలు నడిపిందని పేర్కొన్నారు. పీవీ నరసింహారావు అమలు చేసిన నూతన ఆర్థిక విధానాల ప్రభావంతోనే కార్పొరేట్ శక్తులు, పెట్టుబడిదారులు తమ లాభాలు పెంచుకొని కుబేరులవుతున్నారన్నారు.
వారికి మరింత లాభం చేకూర్చి శ్రామికుల శ్రమను దోచుకునేందుకు వీలుగా ప్రధానమంత్రి మోడీ నాలుగు లేబర్ కోడ్లను అమలు చేయాలని చూస్తున్నారన్నారు. లేబర్ కోడ్ లో అమల్లోకి వస్తే 95% మంది కార్మిక వర్గం వెట్టి చాకిరిలోకి నెట్టబడతారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ, బోనస్ వంటి సదుపాయాలు అందని ద్రాక్షగా మారుతాయి అన్నారు.
లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా జులై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెలో సంగారెడ్డి జిల్లాలోని కార్మిక వర్గం అంతా పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మల్లేష్, రాజయ్య, భాస్కర్ రెడ్డి, వెంకటేశ్వర్లు , చంద్ర శేఖర్, శ్రీరాములు, ప్రభాకర్, సత్తయ్య, సుధాకర్ గౌడ్, శ్రీకాంత్ పాల్గొన్నారు.