17-11-2025 11:30:20 AM
హైదరాబాద్: సౌదీ అరేబియా బస్సు ప్రమాదంలో(Saudi bus accident) రెండు హైదరాబాద్ కుటుంబాలకు చెందిన 15 మంది మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు. ఒక కుటుంబంలో ఎనిమిది మంది, మరో కుటుంబంలో ఏడుగురు సజీవదహనం అయ్యారు. షోయాబ్ అనే యువకుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. ఫ్లైజోన్ ట్రావెల్స్ ద్వారా 16 మంది ఆసిఫ్ నగర్ వాసులు యాత్రకు వెళ్లారు. మృతులను రహీమ్ ఉన్నీసా(60), రెహ్మో తబ్బీ(80), షెహనాబ్ బేగం(41), గౌసియా బేగం(30), అబ్దుల్ ఖలీద్ మహముద్(58), మహ్మద్ మౌలానా(64), అబ్దుల్ షోయబ్ మహ్మద్(24), సోహైల్ మహ్మద్, మస్తాన్ మహ్మద్, పర్వీన్ బేగం, జకియా బేగం, షౌకత్ బేగం, ఫర్హీన్ బేగం, జహీన్ బేగం, మహ్మద్ మంజూరు, మహ్మద్ అలీగా గుర్తించారు. సౌదీ అరేబియాలో మక్కా నుండి మదీనాకు ప్రయాణిస్తున్న భారతీయ ఉమ్రా యాత్రికుల బస్సు ప్రమాదంపై హైదరాబాద్ లోక్సభ ఎంపీ,ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విచారం వ్యక్తం చేశారు. మృతుల మృతదేహాలను తిరిగి తీసుకురావాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం తెల్లవారుజామున మక్కా నుండి మదీనాకు ప్రయాణిస్తున్న ప్యాసింజర్ బస్సు డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టిన ప్రమాదంలో కనీసం 42 మంది భారతీయ ఉమ్రా యాత్రికులు మరణించారు.