17-11-2025 11:03:41 AM
బస్సు ప్రమాద ఘటన పూర్తి సమాచారం తెలియదు: ఎంపీ అసదుద్దీన్
హైదరాబాద్: సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. యాత్రికులతో ప్రయాణిస్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 42 మంది మృతి చెందారు. సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాదం గురించి హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ(MP Asaduddin Owaisi) మాట్లాడుతూ.. "మక్కా నుండి మదీనాకు ప్రయాణిస్తున్న నలభై రెండు మంది హజ్ యాత్రికులు బస్సులో మంటల్లో చిక్కుకున్నారు. నేను రియాద్లోని భారత రాయబార కార్యాలయంలో డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ (DCM) అబూ మాథెన్ జార్జ్తో మాట్లాడాను. ఈ విషయం గురించి వారు సమాచారాన్ని సేకరిస్తున్నారని ఆయన నాకు హామీ ఇచ్చారు. నేను హైదరాబాద్కు చెందిన రెండు ట్రావెల్ ఏజెన్సీలను సంప్రదించి, ప్రయాణీకుల వివరాలను రియాద్ రాయబార కార్యాలయం, విదేశాంగ కార్యదర్శితో పంచుకున్నాను. మృతదేహాలను తిరిగి భారతదేశానికి తీసుకురావాలని, ఎవరైనా గాయపడితే, వారికి సరైన వైద్య చికిత్స అందేలా చూసుకోవాలని నేను కేంద్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ను అభ్యర్థిస్తున్నాను." అని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు.
ఢిల్లీ ఉగ్రవాద పేలుళ్లపై పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ చేసిన ప్రకటనపై ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ, "ఢిల్లీ ఉగ్రవాద పేలుళ్లను నేను ఖండిస్తున్నాను. ఉగ్రవాదానికి చోటు లేదు. వారు దీన్ని ప్లాన్ చేసిన విధానం, మేము వీటన్నింటినీ ఖండిస్తున్నాము. ఇప్పుడు దర్యాప్తు జరుగుతోంది. కానీ ఢిల్లీలో జరిగినది. నౌగామ్ పోలీస్ స్టేషన్లో జరిగిన పేలుడు, అక్కడ మరణించిన వ్యక్తులు, మాకు విషాదకరమైనవి." అని ఒవైసీ అన్నారు. సౌదీలో రోడ్డు ప్రమాదంలో సజీవదహనం అయిన మృతుల్లో హైదరాబాద్ మల్లేపల్లి బజార్ ఘాట్కు చెందిన 16 మంది ఉన్నారు. మృతులను రహీమున్నీసా, రహమత్ బీ, షెహనాజ్ బేగం, గౌసియా బేగం, కదీర్ మహ్మద్, మహ్మద్ మౌలానా, షోయబ్ మహ్మద్, సోహైల్ మహ్మద్, మస్తాన్ మహ్మద్, పర్వీన్ బేగం, జకియా బేగం, షౌకత్ బేగం, ఫర్హీన్ బేగం, జహీన్ బేగం, మహ్మద్ మంజూరు, మహ్మద్ అలీగా గుర్తించారు. సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదంపై యాత్రికుల కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆసిఫ్ నగర్, గోషామహల్ వాసులు యాత్రకు వెళ్లారని బాధిత కుటుంబీకుడు తెలిపారు. అల్ మక్కా టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా 45 మంది యాత్రికులు మక్కా, మదీనా టూర్ కు వెళ్లారని చెప్పారు.
రాత్రి మదీనాకు 25 కిలో మీటర్ల దూరంలో ప్రమాదం జరిగిందని తెలిసిందని బాధితుడు పేర్కొన్నారు. మా ఇంట్లో ముగ్గురు మహిళలు సహా ఆరుగురు వెళ్లారని తెలిపారు. ఘటన గురించి మాకు కూడా పూర్తి సమాచారం తెలియట్లేదని వెల్లడించారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఎంపీ అసదుద్దీన్ కు ఫోన్ చేసినట్లు బాధితులు పేర్కొన్నారు. సౌదీలో జరిగిన బస్సు ప్రమాదంపై ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. జెడ్డాలో ఉన్న కాన్సులేట్ జనరల్, రియాద్లోని డిప్యూటీ అంబాసిడర్తో మాట్లాడారు. మన రాష్ట్రానికి చెందిన యాత్రికులు ఎవరైనా ఉన్నారా.. ఉంటే ఎంత మంది ఉన్నారనే పూర్తి సమాచారం తెలియజేయాలని కోరారు. విదేశీ వ్యవహారాల శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని పూర్తి వివరాలు అందజేయాలని ఢిల్లీలో ఉన్న రెసిడెంట్ కమిషనర్, కో ఆర్డినేషన్ సెక్రెటరీని ఆదేశించారు.