పాక్కు ఆర్మీ చీఫ్ వార్నింగ్
పాకిస్తాన్లో ఇంకా ఎనిమిది ఉగ్ర శిబిరాలు
న్యూఢిల్లీ: ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోందని, శత్రువుల వైపు నుంచి ఎలాంటి దుస్సాహసం జరిగినా దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటామని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది(Upendra Dwivedi) పాకిస్థాన్కు గట్టి సందేశం పంపారు. రాకెట్ ఫోర్స్ ఏర్పాటు భారత్ కు తక్షణావసరమని ఆర్మీ చీఫ్ జనరల్ మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. ఇప్పటికే పాకిస్థాన్, చైనా రాకెట్ ఫోర్స్ పెంచుకున్నాయని ఆర్మీ చీఫ్ వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉగ్రవాద సంఘటనలు తగ్గాయని తెలిపారు.
పాకిస్థాన్ లో 8 ఉగ్ర శిబిరాలు(Eight terrorist camps) ఇంకా చురుగ్గా ఉన్నాయి, ఉగ్రశిబిరాల్లో 150 మంది ఉండొచ్చనని చెప్పారు. వాటిలో 2 అంతర్జాతీయ సరిహద్దు (IB) సెక్టార్లోనూ, 6 నియంత్రణ రేఖ (LC) సెక్టార్లోనూ ఉన్నాయన్నారు. భారత్ పై దాడులకు పాకిస్థాన్ ఇంకా సహకరిస్తూనే ఉందని ద్వివేది ఆరోపించారు. భారత్ లోకి పాక్ గూఢచార డ్రోన్ లను పంపుతోందని ఆర్మీ జనరల్ వివరించారు. జమ్మూ కాశ్మీర్లోని పరిస్థితి సున్నితంగా ఉన్నప్పటికీ, అది పూర్తిగా నియంత్రణలో ఉందని ఆర్మీ చీఫ్ అన్నారు. భారత సైన్యం తన బలగాలను సమీకరించిందని, భూతల దాడులకు సిద్ధంగా ఉందన్నారు. ఉత్తర సరిహద్దు వెంబడి పరిస్థితి స్థిరంగా ఉందన్న ఆయన నిరంతర నిఘా అవసరమని పేర్కొన్నారు.




