09-12-2025 12:00:00 AM
వికారాబాద్, డిసెంబర్ 8: ఎలాంటి అలజడులు లేకుండా ప్రశాంతమైన వాతావర ణంలో ఎన్నికల నిర్వహణనే లక్ష్యం గా పని చేయాలని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర తెలిపారు. పంచాయతీ ఎన్నికల దృష్ట్యా, ప్రజల్లో భద్రతా భావాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే లక్ష్యంతో, బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర, ఐ.పి.ఎస్ స్వయంగా పాల్గొన్నారు. ఈ మార్చ్లో పోలీసు బలగాలు, క్విక్ రియాక్షన్ టీమ్లు (QRT), ఇతర భద్రతా సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ఎటువంటి భయాందోళనలకు గురికాకుండా, శాంతియుత వాతావరణంలో స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. ఈ ఫ్లాగ్ మార్చ్ ప్రధాన ఉద్దేశం ప్రజలలో ధైర్యాన్ని నింపి, చట్టాన్ని ఉల్లంఘించాలని చూసే అసాంఘిక శక్తులకు, రౌడీషీటర్లకు బలమైన హెచ్చరిక పంపడమేనని ఆమె స్పష్టం చేశారు.
ముఖ్యంగా సున్నితమైన మరియు అతి-సున్నితమైన గ్రామాలలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేసిందని ఎస్పీ హామీ ఇచ్చారు. ఎస్పీ ప్రజలకు కీలక సూచనలు చేస్తూ, ముఖ్యంగా క్రిటికల్ గ్రామాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా, ఇతరులను భయపెట్టేందుకు ప్రయత్నించినా, లేదా అనుమానాస్పద వ్యక్తులు సంచరించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.
గ్రామాలలో శాంతిభద్రతలను కాపాడడంలో కేవలం పోలీసుల పాత్రే కాక, ప్రజల సహకారం కూడా ఎంతో ముఖ్యమని ఎస్పీ తెలిపినారు. పోలీస్ యంత్రాంగం ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి, అండగా ఉంటుందని, ప్రజలు నిర్భయంగా ఓటు వేయడానికి అవసరమైన అన్ని రక్షణ చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ బి. రాములు నాయక్, తాండూర్ డీఎస్పీ ఎన్. యాదయ్య, సబ్ డివిజన్ పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది.