09-08-2024 02:25:03 AM
సికింద్రాబాద్ స్కందగిరి మఠంలో నిర్వహణ
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 8 (విజయక్రాంతి): సికింద్రాబాద్ స్కందగిరి మఠంలో శ్రీసుబ్రమణ్యస్వామి ఆలయంలో ఈ నెల 11 నుంచి 13 వరకూ వారణాసికి చెందిన స్వామి అభిషేక్ బ్రహ్మచారి మహారాజ్ ఆధ్వర్యంలో శ్రీవిద్యా కోటి కుంకు మార్చన మహాయజ్ఞం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ నిర్వాకులు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రపంచశాంతి, దేశపురోభివృద్ది, ప్రజలు సుఖశాంతులతో ఉండాలని శ్రీవిద్యా కోటి కుంకుమార్చన చేపట్టనున్నట్టు పేర్కొన్నారు.
ఇందులో భాగంగా లలితా త్రిపుర సుందరిదేవీ పేర్లను కోటిసార్లు పఠించడంతోపాటు ఖీర్తో చేసిన నైవేద్యాలను సమర్పించనున్నట్టు వెల్లడించారు. ఈ క్రతువులో సాధువులు, పండి తులు, ఆచార్యులతోపాటు వెయ్యి మంది మహిళలు పాల్గొంటారని తెలిపారు. చెన్నై, కాంచీపురం, ఢిల్లీ, వారణాసి, ముంబయి, ప్రయాగ్రాజ్, గౌహతి, కోల్కతా, జైపూర్లో ఈ క్రతువు గతంలో జరిగిందని వివరించారు. శ్రీవిద్యాకోటి కుంకుమార్చన శుభ ఫలితాలు ఇస్తుందని చెప్పారు.
ఈ నెల 11 నుంచి 13 వరకూ ఉదయం 7 గంటల నుంచి మండప పూజ, సాంస్కృతిక కార్యక్రమాలు, భగవతీ రాజోపచార పూజ, కుంకుమార్చన తదితర పూజాకార్యక్రమాలు ఉంటాయని వెల్లడించారు. 13న పూర్ణాహుతి ఉంటుందని తెలిపారు. ప్రతి రోజూ సాయంత్రం దేశానికి, ప్రపంచానికి సంబంధించిన ప్రస్తుత, ముఖ్యమైన అంశాలతో పాటు ఆదిశంకరాచార్యస్వామి కరపత్రి మహారాజ్ వంటి జీవితం, రచనలపై చర్చ లు జరుగుతాయని పేర్కొన్నారు.