calender_icon.png 20 June, 2025 | 2:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.85.05 కోట్లు రిఫండ్

09-08-2024 02:27:46 AM

  1. సైబర్ నేరాల బాధితులకు భారీ ఊరట 
  2. టీజీసీఎస్‌బీ, టీజీఎల్‌ఎస్‌ఏ సహకారం

హైదరాబాద్, ఆగస్టు 8 (విజయక్రాంతి): రాష్ర్టంలోని అన్ని కమిషనరేట్లు, జిల్లాల్లో ఈ ఏడాది మార్చి నుంచి జూలై వరకు సైబర్ మోసాలకు గురైన బాధితులకు రూ.85.05 కోట్లు రిఫండ్ చేయించడంతో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) సరికొత్త మైలురాయిని అధిగమించింది. టీజీ సీఎస్‌బీ, తెలంగాణ రాష్ర్ట న్యాయ సేవాధికార సంస్థ (టీజీఎల్‌ఎస్‌ఏ) సంయుక్త కృషి ఫలితంగానే ఇదే సాధ్యమైందని పోలీస్ శాఖ చెబుతోంది. చాలాకాలంగా బ్యాంకుల్లో మోసపూరిత నిధులు నిల్వ ఉంటున్నాయి.

వాటిని బాధితులకు చెల్లించడం ఒక సమస్యగా మారింది. ఈ క్రమంలో ఈ సమస్య పరిష్కారానికి ఫిబ్రవరి 2024లో టీజీఎల్‌ఎస్‌ఏ సహకారంతో టీజీసీఎస్‌బీ కీలక ముందడుగు వేసింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్‌పీసీ) సెక్షన్ 457 కింద సైబర్ నేరాల పిటిషన్లు దాఖలు చేసేందుకు ప్రామా ణిక ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌వోపీ)ను టీజీసీఎస్‌బీ అభివృద్ధి చేసింది. ఈ ఎస్‌వోపీని రాష్ట్రంలోని అన్ని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థలకు టీజీసీఎస్‌బీ ద్వారా పోలీసు శాఖ పంపింది.

సైబరాబాద్ కమిషనరేట్‌లోనే రూ.36.8 కోట్లు రిఫండ్

ఈ ఏడాది ఫిబ్రవరి 20 నుంచి ఎస్‌వోపీని అమలు చేయాలని అన్ని జిల్లా న్యాయ మూర్తులకు మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ క్రమంలో జూలై వరకు అన్ని జిల్లాల న్యాయస్థానాల్లో మొత్తం 6,840 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిలో 6,449 పిటిషన్లకు సంబంధించిన రూ.85.05 కోట్ల మొత్తాన్ని రిఫండ్ చేయడానికి అనుమతులు మంజూ రు చేశారు. ఈ మొత్తంలో రూ.36.8 కోట్లు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే రిఫండ్ చేశారు. ఇది అత్యధిక రిఫండ్లను ప్రాసెస్ చేసిన యూనిట్‌గా నిలిచింది. ఈ చర్య సైబర్ బాధితులకు తక్షణ ఆర్థిక ఉపశమనం అందించినట్టు పోలీస్ శాఖ తెలిలింది. 

గోల్డెన్ అవర్ కీలకం

సైబర్ మోసాన్ని గుర్తించిన వెంటనే లేదా అనుమానించిన వెంటనే ‘గోల్డెన్ అవర్’లో సైబర్ మోసాన్ని తమకు ఫిర్యాదు చేయడం చాలా ముఖ్యమని సైబర్ సెక్యూరిటీ బ్యూరో నొక్కి చెబుతోంది. వెంటనే ఫిర్యాదు చేయ డం వల్ల నిందితుడి బ్యాంకు ఖాతాలు, డిజిటల్ వాలెట్లలో కాజేసిన సొమ్ము మొత్తాన్ని స్తంభింపజేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని పేర్కొంది. తద్వారా బాధితుల కు రిఫండ్లను సులభతరం చేస్తుందని వెల్లడించింది. బాధితులు 1930కి కాల్ చేయ డం ద్వారా లేదా cybercrime.gov.in పోర్టల్‌ను సందర్శించడం ద్వారా వెంటనే మోసాన్ని ఫిర్యాదు చేయాలని కోరింది.