17-05-2025 12:45:45 PM
ఎన్హెచ్ఆర్సి జిల్లా చైర్మన్ రాథోడ్ రమేష్
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): రాజీవ్ యువ వికాసం పథకంలో భాగంగా అర్హులను ఎంపిక చేయడానికి సిబిల్ స్కోర్ ఆధారం చేసుకునే నిబంధన వెనక్కి తీసుకోవాలని జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా చైర్మన్ రాథోడ్ రమేష్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని(Rajiv Yuva Vikasam Scheme) ప్రారంభించడం అభినందనీయమన్నారు. గత ప్రభుత్వ హయంలో కేవలం రెండు దాపాలుగా మాత్రమే రుణాలు అందించడం జరిగిందన్నారు.
ఆ పదేళ్ల కాలంలో నిరుద్యోగ యువకులు ఎలాంటి ఉపాధి లేకుండా నష్టపోయారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారులకు సిబిల్ స్కోర్ నిబంధన విధించడం సరైనది కాదన్నారు. ఈ నిబంధనలతో మారుమూల గ్రామాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనారిటీ నిరుపేద యువకులు నష్టపోయే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సిబిల్ స్కోర్ నిబంధనను వెనక్కి తీసుకొని రుణాలు ఎంపికలో అర్హులైన నిరుపేదలకు ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు.