07-06-2025 01:06:06 AM
24 గంటల వ్యవధిలో బీజాపూర్లో మరోసారి ఎదురుకాల్పులు
భద్రాద్రి కొత్తగూడెం/ఆదిలాబాద్, జూన్ 6 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దు రాష్ట్రం ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా నేషనల్ అటవీ పార్క్ దండకారణ్యంలో మరోమారు తుపాకీ పేలింది. 24 గంటల వ్యవధిలో సాయుధ దళాలతో మరోసారి జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కీలక నేత, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ మరణించినట్టు బీజాపూర్ పోలీసు వర్గాలు వెల్లడించాయి.
ఘటనా స్థలి లో ఏకే 47 స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. కాగా అడెల్లు తలపై రూ.20 లక్షల రివార్డు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా సాయుధ దళాలు చేపట్టిన సెర్చ్ ఆపరేషన్లో గురువారం ఇదే దండకారణ్యంలో కేంద్ర కమిటీ సభ్యుడు శాంతి చర్చల ప్రతినిధి గౌతమ్ అలియాస్ సుధాకర్ మృతి చెందిన సంగతి తెలిసిందే.
వ్యూహ రచనలో సిద్దహస్తుడైన మైలారపు అడెల్లు లక్ష్యంగా ఛత్తీస్గఢ్ పోలీసులు ‘ఆపరేషన్ అడెల్లు’ పేరిట కూంబింగ్ నిర్వహిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే శుక్రవారం సెర్చ్ ఆపరేషన్లో భాగంగా అటవీలో జల్లెడ పడుతున్న సమయంలో పోలీసులకు మావోయిస్టులు ఎదురయ్యాయి. ఇరువురి మధ్య భీకర కాల్పులు జరగాయి. ఈ క్రమంలోనే అడెల్లు ఎన్కౌంటర్లో హతమయ్యాడు.
ఎన్కౌంటర్లో మృతి చెందిన మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ స్వస్థలం ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ మండలంలోని పొచ్చర గ్రామం. 1995 నుంచి సాయుధ పోరాటం వైపు అడుగులు వేశారు. ఉత్తర తెలంగాణలోని పలు ప్రాంతాల్లో పీపుల్స్ వార్ పార్టీలో పనిచేసిన భాస్కర్ దండకారణ్య అటవీ ప్రాంతంలో షెల్టర్ ఏర్పాటు చేసుకొని ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ గత వైభవం కోసం దృష్టి సారించారు.
బోథ్ మండల కేంద్రంలో పదవ తరగతి చదివారు. తర్వాత నిర్మల్ లో ఇంటర్ విద్యను అభ్యసిస్తున్న సమయంలోనే పీపుల్స్ విద్యార్థి రాడికల్ యూనియన్కు ఆకర్షితుడయ్యాడు. 1986లో బోథ్ దళ సభ్యుడిగా పనిచేసి, అక్కడి నుండి 1989లో ఇంద్రవెళ్లి మండల డిప్యూటీ కమాండర్గా ఎంపికయ్యాడు. ఆ తర్వాత కేంద్ర కమిటీ ఆదేశాల ప్రకారం ఛత్తీస్గఢ్లో విధులు నిర్వహిస్తున్నాడు.
అయితే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో జరిగిన దాదాపు ఐదు ఎన్కౌంటర్లలో అడెల్లు తృటిలో తప్పించుకున్నాడని పోలీసులు వర్గాలు వెల్లడించాయి. కాగా అడెల్లు అలియాస్ భాస్కర్ దళంలో పని చేస్తున్న లింగక్కతో గతంలో వివాహం జరిగింది. అయితే ఇటీవలే జరిగిన ఎన్కౌంటర్లో లింగక్క ప్రాణాలు కోల్పోయింది. ఇక తెలంగాణ, మహారాష్ట్ర ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లో సాయుధ బలగాలు భారీగా మోహరించాయి.
మావోయిస్టుల కార్యకలాపాలను కట్టడి చేసేందుకు గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేశాయి. మావోయిస్టు పార్టీకి చెందిన ముఖ్య నేతల షెల్టర్ జోన్లను ట్రస్ట్ చేసిన బలగాలు పెద్ద సంఖ్యలో కూంబింగ్ నిర్వహిస్తూ ముఖ్య నాయకులను ఒక్కొక్కరిగా మట్టుబెడుతూ వస్తున్నాయి. దీంతో మావోయిస్టు కేంద్ర కమిటీ తో పాటు ఆయా రాష్ట్రాల కమిటీలు కూడా బయటకు రాకుండా దట్టమైన అటవీ ప్రాంతాలకే పరిమితమవుతున్నట్టు తెలుస్తోంది.