కమ్మగూడలో పార్కు స్థలం కబ్జా
ఎమ్మెల్యే రంగారెడ్డికి కాలనీ వాసుల ఫిర్యాదు
తుర్కయంజాల్, డిసెంబర్ 6: తుర్కయంజాల్ సర్కిల్ పరిధి కమ్మగూడ శివాజీనగర్ కాలనీలో 3వేల గజాల పార్కు స్థలం కబ్జాకు గురైందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డికి స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శివాజీ నగర్లో పార్కు స్థలాన్ని కబ్జారాయుళ్ల చెర నుంచి విడిపించాలని ఎమ్మెల్యేను కోరినట్లు తెలిపారు. ఈ స్థలాన్ని ప్రజా అవసరాలకు వినియోగించాలని సూచించారు.
అలాగే పార్కు స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించి రక్షించాలన్నారు. అలాగే కాలనీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించాలని ఎమ్మెల్యే విన్నవించినట్లు తెలిపారు. కాలనీ వాసుల అభ్యర్థన పట్ల ఎమ్మెల్యే రంగారెడ్డి సానుకూలంగా స్పందించారన్నారు. ఈ కార్యక్రమంలో శివాజీ నగర్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ వల్లపు భాస్కర్ రెడ్డి, కొండ సుధాకర్ రెడ్డి, బండ శ్రీనివాస్ రెడ్డి, కసిరెడ్డి శేఖర్ రెడ్డి, సత్యం గౌడ్, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




