calender_icon.png 4 June, 2025 | 3:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ వచ్చినా.. పేదల బతుకులు మారలేదు

02-06-2025 10:38:07 PM

సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ...

ఎల్బీనగర్: అమరుల త్యాగాలతో సాధించిన తెలంగాణ రాష్ట్రంలో పేదల బతుకులు మారలేదని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ(CPI National General Secretary Narayana) అన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజాస్వామ్యం లేదని, పాలనలో మంత్రులకు స్వేచ్ఛ లేదని, కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు రాకుండా పాలన చేసిన ఏకైక ముఖ్యమంత్రి అని విమర్శించారు. సరూర్ నగర్ డివిజన్ లోని ఎస్ ఆర్ గార్డెన్ లో ఇస్కప్ (ఇండియన్ సొసైటీ ఫర్ కల్చరల్ కో ఆపరేటివ్ అండ్ ఫ్రెండ్ షిప్) ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు(Telangana State Formation Day) నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణ, మాజీ ఎంపీ అజీజ్ పాషా హాజరై మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన... ఆశించిన ఫలితాలు రాలేదన్నారు. హైదరాబాద్ లో అనేక మంది పేదలు సొంత ఇల్లు లేకుండా గుడిసెల్లో ఉంటున్నారని తెలిపారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజల బతుకులు మారలేదని, కేవలం నాయకులు బాగుపడ్డారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్లను కూల్చి, రోడ్డున పడేశారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అమలు కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, అధికారం చేపట్టిన తరువాత నిధులు లేవని చెప్పడం సరికాదన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. సీపీఐ పార్టీ నిరంతరం పేదలు కోసం పోరాడుతుందని, పేదలు హక్కుల కోసం ఉద్యమిస్తామని తెలిపారు. మాజీ ఎంపీ అజీజ్ పాషా మాట్లాడుతూ... పాలకులు పేదల సంక్షేమాన్ని విస్మరించారన్నారు. హైదరాబాద్ నగరంలో అనేక మంది పేదలు మురికివాడల్లో ఉంటున్నారని, వారికి ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకొని ఉంటే.. వాటిని కూల్చి రోడ్డున పడేశారని, పెద్దలకు మాత్రం ఎకరాల భూమిని అప్పనంగా క్రమబద్ధీకరణ చేశారని ఆరోపించారు. సీపీఐ పార్టీ అనేక భూ పోరాటాలు చేసి, ఎల్బీనగర్ నియోజకవర్గంలో అనేక మంది పేదలకు సొంతింటి స్థలాలు పంపిణీ చేశామన్నారు. నందనవనం కాలనీలో ఉన్న పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు లేదా ప్రభుత్వ భూముల్లో ఇంటి జాగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో  ఇస్కప్ సంస్థ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్, సీపీఐ నాయకులు భిక్షపతి గౌడ్, విశ్వశర్మ, కవిత, ఫాతిమా, నందనవనం కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.