ప్రతి గింజను కొనుగోలు చేయాలి
- మార్కెట్ యార్డ్ను సందర్శించిన మాజీ మంత్రి రామన్న
- ఎకరానికి 10-13 క్వింటాళ్ల కొనుగోలు చేయాలని డిమాండ్
ఆదిలాబాద్, మార్చి 25 (విజయక్రాంతి): రైతులు పండించిన పంట చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న డిమాండ్ చేశారు. గురువారం జైనథ్ మార్కెట్ యార్డ్లో కొనసాగుతున్న శనగల కొనుగోళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకోన్నారు. అనంతరం రైతుల సమస్యలపై తహసిల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ మేరకు జోగు రామన్న మాట్లాడుతూ... ఎకరానికి 7 క్వింటాళ్ల కాకుండా గత ప్రభుత్వం కొనుగోలు చేసిన మాదిరిగా ఎకరానికి 10 నుండి 13 క్వింటాళ్ల కొనుగోలు చేయాలన్నారు. రైతుల పక్షాన వ్యవసాయ మంత్రిని కలుస్తామని అన్నారు. అలాగే కలెక్టర్కు మరోసారి ఓటీపీ విధానంపై గుర్తు చేసి వినతి పత్రం అందజేస్తామన్నారు.
కౌలు రైతులకు పండించిన పంటను సైతం పూర్తిగా కొనేలా బి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టి వారికి అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో నాయకులు లింగ రెడ్డి, గణేష్ యాదవ్, వెంకట్ రెడ్డి, దేవన్న, వెంకన్న, సాయి తేజ, కిషన్ తదితరులు పాల్గొన్నారు.




