13-06-2025 07:56:14 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా అక్షరాస్యత నేర్చుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో వయోజన విద్యపై నిర్వహించిన శిక్షణ తరగతులు ఆయన మాట్లాడారు. పాఠశాలలు, కళాశాలలు, ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు అందరూ ప్రథమంగా తమ తల్లిదండ్రులను అక్షరాస్యులుగా చేయాలని, తదుపరి చుట్టుపక్కల వారిని అక్షరాస్యులుగా సంపూర్ణ అక్షరాస్యత సాధించడానికి దోహదపడాలని కోరారు. మొదట గ్రామస్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయిలో నిరక్షరాస్యులను, అక్షరాస్యులుగా మార్చి నిర్మల్ జిల్లాను అగ్రస్థానంలో ఉంచాలని ఆయన ఈ సందర్భంగా కోరడం జరిగింది. శిక్షణకు హాజరైన, మండల విద్యాధికారులు, సెర్ప్ సిబ్బంది సీఆర్పీలు, ఐఆర్పీలు అందరూ కలిసి సమన్వయంతో స్వయం సహాయక బృందాల ద్వారా జిల్లాలోని నిరక్షరాస్యులను గుర్తించి, ఒక ప్రత్యేక ప్రణాళికతో కమిటీల ద్వారా శిక్షకులను నియమించుకొని అందరినీ అక్షరాస్యులుగా చేయాలని సూచించారు.
జిల్లాకు దాదాపు 31 వేలమంది నిరక్షరాస్యులను లక్ష్యంగా ఇచ్చినప్పటికీ, అందరూ ఆ లక్ష్యాన్ని పూర్తిచేస్తూ, ఇంకా ఎక్కువ శాతం మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని కోరడం జరిగింది. డీఆర్పీలు రవి గౌడ్, శ్రీనివాస్ రెడ్డిలు చెప్పిన విషయాలను చక్కగా అవగాహన చేసుకుని ప్రణాళిక ప్రకారం గ్రామస్థాయిలో సర్వేలు నిర్వహించి అందరికీ శిక్షణ ఇచ్చి అక్షరాస్యులుగా మార్చాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఇన్చార్జి పీడీ నాగవర్ధన్, మెప్మా పీడీ సుభాష్, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ అశోక్, వయోజన విద్య కోఆర్డినేటర్ తిరుపతిరావు,డిపిఎం సాయిప్రసాద్, జిల్లా విద్యాశాఖ సమాన్వయకర్తలు నర్సయ్య, ప్రవీణ్ కుమార్, మండల విద్యాధికారులు, ఏపిఎం, సీసీలు, సీఆర్పీలు మరియు ఐఆర్పిలు పాల్గొన్నారు.