26-06-2025 01:07:23 AM
గజ్వేల్, జూన్ 25 : అంతా మా ఇష్టమే అనే విధంగా ప్రైవేటు పాఠశాలలు వ్యవహరిస్తున్నాయి. స్వచ్ఛంద సంస్థల పేరుతో ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేసుకుని, పాఠశాల నిర్వహణకు అనుమతులు తీసుకుంటున్నారు. స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో కొనసాగే ఈ పాఠశాలలు అందించే సేవలు విలువలు వేలు లక్షల రూపాయల్లోనే ఉంటాయి. గజ్వేల్ నియోజకవర్గంలో దాదాపు 40 వరకు ప్రైవేటు పాఠశాలలు కొనసాగుతున్నాయి.
250 మంది విద్యార్థులు మొదలుకొని 1000 1500 వరకు విద్యార్థులతో పాఠశాలలను నిర్వహిస్తున్నారు. ఆయా పాఠశాలలు ప్రభుత్వ గుర్తింపు ( రికగ్నైజేషన్ ) కోసం అధికారులకు సమర్పించే నివేదిక పత్రాలలో అందించిన ఫీజుల వివరాలతో ఏమాత్రం పోలిక లేకుండా నాలుగు ఐదు రెట్ల అధిక ఫీజులు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వసూలు చేస్తున్నారు.
ప్రాథమిక విద్య వరకు ఆయా విద్యా సంస్థల వారిగా తమకు నచ్చిన సంస్థలకు సంబంధించిన పుస్తకాలను వినియోగిస్తున్నారు. ఎమ్మార్పీ ధరలకే విక్రయిస్తున్నామని వందల రూపాయల విలువైన రూపాయల విలువైన పుస్తకాలు వేల రూపాయలకి అంటగడుతున్నారు. ఇక 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ పుస్తకాలే వినియోగించాల్సి రావడంతో ప్రైవేట్ పాఠశాలలు కొత్త ఆదాయ మార్గాలు వెతుక్కున్నాయి.
వర్క్ బుక్స్ పేరుతో 6నుండి 10వ తరగతి విద్యార్థులకు వేల రూపాయలకు కొనుగోలు చేసేలా తల్లిదండ్రులకు వివిధ కారణాలను వెల్లడిస్తున్నారు. కేవలం పుస్తకాల విక్రయాలతోనే పాఠశాలల ఏడాది నిర్వహణకు అవసరమయ్యే పెట్టుబడిలో సగానికి పైగా పాఠశాల యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయి.
చిన్న స్థాయి పాఠశాలలు రూ. 5 నుంచి రూ. 10 లక్షల వరకు వ్యాపారాలు చేస్తుంటే, పెద్ద పాఠశాలలు రూ.40 నుంచి రూ. 50 లక్షల వరకు పుస్తకాలతో వ్యాపారాలు చేస్తూ డబ్బు గడిస్తున్నాయి. ఇక అధిక ఫీజులతో కోట్ల రూపాయల వ్యాపారాలు చేస్తున్నాయి.
స్వచ్ఛంద సంస్థలుగా నమోదు చేసుకున్న ఈ పాఠశాలలు ప్రతి సంవత్సరం తమ తమ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన అకౌంటు పుస్తకాలను, బ్యాంకుల వ్యవహారాలను, రికగ్నైజేషన్ నిబంధనల ప్రకారం అప్పగించాల్సిన బాధ్యత ఉంది. కానీ జిల్లాలో ఏ ఒక్క పాఠశాల కూడా తమ విద్యాసంస్థల అకౌంట్ పుస్తకాలను, వివరాలను అధికారులకు అందజేయడం లేదు.
కానరాని పేరెంట్స్ కమిటీలు
దిగగ్నైజేషన్ నిబంధనల ప్రకారం ప్రతి పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆ కమిటీలను సంప్రదించి వారి సమ్మతితోనే ఫీజుల పెంపకం విషయంలో, పాఠశాలలో వసతుల నిర్వహణ తదితర అంశాల గురించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఏ ఒక్క పాఠశాలలో కూడా పేరెంట్స్ కమిటీల ప్రసక్తే రావడం లేదు.
తమ ఇష్టానుసారంగా పాఠశాలల యాజమాన్యాలు ఫీజులను వసూలు చేస్తూ తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కొన్ని పాఠశాలలైతే తాము చెప్పిన ఫీజులు చెల్లించని పక్షంలో వెంటనే వెళ్ళిపోవచ్చు అంటూ తల్లిదండ్రులను చిన్నచూపు చూస్తున్నాయి. తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తమ అవసరాలను కూడా మానుకొని పైసా పైసా కూడబెట్టి తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో తల్లిదండ్రులు చదివిస్తున్నారు.
దీనికి తోడు పలు రకాల అదనపు ఖర్చులు కూడా పాఠశాలల్లో కొనసాగుతూనే ఉంటాయి. వార్షికోత్సవం, పిక్నిక్ అంటూ సాధారణ ఖర్చు కన్నా అదనపు భారాన్ని తల్లిదండ్రులపై వేసి ఆ డబ్బుతోనే తమ పాఠశాలల ప్రచారాన్ని చేసుకుంటున్నాయి. తమ పిల్లలు గొప్పగా ఎదగాలన్న ఆశలను, మధ్యతరగతి ప్రజల చేతకానితనం ప్రైవేటు పాఠశాలలు తమ వ్యాపారానికి అదునుగా మారింది.
వేలు, లక్షలు పోసి చదివించినా బట్టి చదువులే తప్ప అసలైన జ్ఞానాన్ని ప్రైవేటు పాఠశాలలు అందించలేకపోతున్నాయి. కేవలం విద్యా సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధిస్తే వారేదో గొప్ప స్థాయికి చేరిపోయారన్నట్టు చిత్రీకరిస్తూ తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు. మరొకటి విద్యా సంవత్సరానికి వచ్చేసరికి చిన్న తరగతిలో ఉత్తరులైన విద్యార్థులకు ఆ తరగతిలో చదివిన జ్ఞానం ఏమాత్రం ఉండడం లేదు.
పైగా ఒక తరగతిలో వందల సంఖ్యలో విద్యార్థులను చేర్చుకుంటున్న పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల మధ్య పరస్పర స్నేహభావం, క్రమశిక్షణ తదితర అంశాలపై దృష్టి సారించలేకపోతున్నాయి. కేవలం ఫీజుల పైన, సిలబస్ పూర్తి చేయడం పైనే ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయుల దృష్టి సారించడంతో క్రమశిక్షణ మానవతా విలువలు లేని లేనివారిగా భావి భారత పౌరులు తయారవుతున్నారు.
మామూళ్ల మత్తులో జిల్లా, మండల విద్యాధికారులు
ప్రభుత్వ,, ప్రైవేటు పాఠశాలల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు చేతులు ముడుచుకు కూర్చుంటున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో కొనసాగుతున్న దారుణాలను మండల విద్యాధికారి, జిల్లా విద్యాధికారి దృష్టికి తీసుకువెళ్లగా తామేమి చర్యలు తీసుకోలేమని చేతులెత్తేశారు. ప్రైవేటు పాఠశాలల అధిక ఫీజుల వసూళ్లు తదితర అంశాలపై గజ్వేల్ మండల ఇంచార్జ్ విద్యాధికారి కృష్ణను వివరణ కోరగా, మా చేతుల్లో ఏమీ లేదు అంటూనే జిల్లా విద్యాధికారి దృష్టికి తీసుకు వెళ్లాలని సలహా ఇచ్చారు.
జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ ను ఈ విషయంపై వివరణ కోరగా, ప్రైవేటు పాఠశాలలు బాగా పరపతి గల వారే నడిపిస్తున్నారని, వారి విషయంలో తాము ఎలాంటి చర్యలు తీసుకోలేమన్నారు. అవసరం లేని పుస్తకాలను పాఠశాలల్లో విక్రయిస్తున్నారని చెప్పగా వాటిని మండల విద్యాధికారి పరిశీలించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ఇలా ఎవరికి వారు పొంతన లేని సమాధానాలు చెప్పడం వారి నిర్లక్ష్యాన్ని, ప్రైవేటు పాఠశాలలతో వారి రూపాయి కారి ఒప్పందాలను తేటతెల్లము చేస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వ పాఠశాలలు నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.