మాజీ ఏఈకి ఏడాది జైలు
l ఏసీబీ కేసులో కింది కోర్టు శిక్ష సమర్థించిన హైకోర్టు
హైదరాబాద్, ఏప్రిల్ 27(విజయక్రాంతి): తాను లంచం తీసుకో లేదని రూ.20 వేలు చేబదులు తీసుకుంటుంటే పోలీసులు పట్టుకుని అక్రమంగా కేసు పెట్టారంటూ ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మాజీ ఏఈ వాదనను హైకోర్టు కొట్టివేసింది. ఏసీబీ కోర్టు ఏడాది శిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. ఈ కేసులో పిటిషనర్ జైలులో గడిపిన కాలాన్ని మినహాయించాలని పోలీసులను ఆదేశించింది. రోడ్డు కాంట్రాక్ట్ బిల్లుచెల్లింపులకు ఖమ్మం జిల్లా అశ్వరావుపేట మండలం ఆర్అండ్బీలో అసిస్టెంట్ ఇంజినీర్గా పనిచేస్తున్న సోమ రాఘవేందర్, కాంట్రాక్టర్ నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. నేరం రుజువైనట్టు పేర్కొ న్న ఏసీబీ కోర్టు రాఘవేందర్కు ఏడాది జైలు శిక్ష విధించింది. 2005 నాటి ఈ కేసులో 2009లో వెలువడిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసింది.






