13 May, 2026 | 1:30 AM

భూభారతి పెండింగ్ దరఖాస్తుల వేగం పెంచాలి

13-05-2026 12:00 AM

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

జనగామ, మే 12 (విజయక్రాంతి): మంగళవారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో భూ భారతి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోమ్ తో కలిసి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా మండలాల వారీగా పెండింగ్ దరఖాస్తుల ప్రక్రియపై క్షుణ్ణంగా సమీక్షించి, పలు సూచనలు చేశారు.

ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. భూ భారతిలో గల వివిధ మాడ్యూల్స్ లోని సక్సెషన్, మ్యుటేషన్, ఖాతా సమీకరణ, డేటా కరెక్షన్, అర్బన్ ల్యాండ్, కోర్టు కేసులు, జీపీపీ, పీపీబీ, నాలా తదితరాల పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అలాగే పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచాలని, త్వరగా పూర్తి చేయాలని సూచించారు.

అదే విధంగా ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో ఈ - ఆఫీసు విధానాన్ని అమలు చేయాలని సూచించారు. ఈ - ఆఫీస్ వినియోగాన్ని పెంచి, పరిపాలనలో పారదర్శకత, వేగాన్ని సాధించాలన్నారు. ఈ-ఆఫీస్ వ్యవస్థను పూర్తిస్థాయిలో అమలు చేసి, సమన్వయంతో పని చేయాలని తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో ఆర్డీఓలు గోపీరాం, అన్ని మండలాల తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.