18 April, 2026 | 4:35 AM

కాచిగూడ చారిత్రక వైభవాన్ని చాటేలా ఫసాడ్ లైటింగ్

10-06-2025 01:00 AM

- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, జూన్ 9 (విజయక్రాంతి): గోతిక్ శైలిలో అత్యత్భుత కట్టడమైన కాచిగూడ రైల్వేస్టేషన్ చారిత్రక వైభవాన్ని చాటేలా ప్రత్యేకమైన ఫసాడ్ లైటింగ్‌తో తీర్చిదిద్దినట్టు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. రూ.2.23 కోట్లతో కాచిగూడ రైల్వేస్టేషన్‌కు ఏర్పాటు చేసిన ఫసాడ్ లైటింగ్‌ను సోమవారం రాత్రి కిషన్‌రెడ్డి ప్రారంభించారు.

1916లో నిర్మించిన ఈ స్టేషన్ ఎంతో ప్రత్యేకమైన ప్రాచీన కట్టడమని, ఈ ఆధునిక ఫసాడ్ లైటింగ్‌తో ఈ భవనం మరింత అత్భుతంగా కనిపిస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు. 785 ఇల్యూమినేషన్ లైట్లతో స్టేషన్‌ను రాత్రిపూట చూసేందుకు రెండు కళ్లు చాలవన్నారు.

ఇప్పటికే గ్రీన్ ఎనర్జీ వాడకం ద్వారా ఈ స్టేషన్ జాతీయస్థాయిలో ఉత్తమగా గుర్తింపు పొందిందని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ అనిల్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు, దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్, హైదరాబాద్ డీఆర్‌ఎం లోకేష్ విష్ణోయ్ తదితరులు పాల్గొన్నారు.