02-08-2025 12:51:53 AM
జనగామ ఆగస్టు 1 (విజయ క్రాంతి) : శుక్రవారం అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పింకేష్ కుమార్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఉన్న సదరం విభాగాన్ని సంబంధిత వైద్యాధికారులతో సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. హాస్పిటల్ ను నిత్యం పరిశుభ్రంగా ఉంచాలన్నారు పేషెంట్లకు ఇబ్బందులు కలగరాదన్నారు. వైద్య అధికారులు పర్యవేక్షిస్తూ పేషెంట్లకు సహకరించాలన్నారు.
ఈ సందర్భంగా ఆసుపత్రిలో దివ్యాంగుల కొరకు ఏర్పాటు చేసిన సదరం విభాగాన్ని పరిశీలించారు. సదరం యుడిఐడి పొందేందుకు వచ్చే దివ్యాంగులకు తగిన సౌకర్యాలు కల్పించాలని, అందుకు తగిన పనులు చేపట్టాలని వైద్యాధికారులకు సూచించారు. దివ్యాంగులు సులభతరంగా పరీక్షలు నిర్వహించుకునేలా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. అదనపు కలెక్టర్ వెంట మెడికల్ కళాశాల పర్యవేక్షకులు రాజలింగం గోపాల్ రావు డాక్టర్లు వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.