30-05-2025 12:00:00 AM
- అనుమతుల్లేవు.. అయినా అడ్మిషన్లు
- ఆఫీసులు తెరిచి విద్యార్థులను చేర్చుకుంటున్న కాలేజీలు
- ఎప్సెట్ కౌన్సెలింగ్ ప్రారంభం కాకుండానే అడ్మిషన్లు
- ఆరా తీస్తున్న అధికారులు
హైదరాబాద్, మే 29 (విజయక్రాంతి): రాష్ట్రంలో నాలుగు ఫేక్ ఇంజినీరింగ్ కాలేజీలు వెలిశాయని తెలంగాణ ఉన్నత విద్యామండలి అధికారుల దృష్టికి వచ్చింది.
ఆయా విద్యాసంస్థలకు అఖిల భారతీయ సాంకేతిక మండలి (ఏఐసీటీఈ) నుంచి అనుమతుల్లేవు. జేఏన్టీయూహెచ్ నుంచి అనుమతి కూడా లేదు. ఆ నాలుగు కాలేజీలు ఏంచక్కా ఆఫీసులు తెరిచి అడ్మిషన్లు తీసుకుంటున్నాయి. ఈ విద్యాసంవత్సరానికి లక్షల్లో ఫీజులు వసూలు చేసి కాలేజీల్లో విద్యార్థులను చేర్చుకుంటున్నాయి.
క్లాసులు కూడా హైదరాబాద్లోనే నిర్వహిస్తామని బహిరంగంగా చెబుతున్నాయి. అయితే వీటిల్లో చేరిన విద్యార్థులు మోసపోయే ప్ర మాదం ఉందని అధికారులు ఆందోళన వ్య క్తం చేస్తున్నారు. ఇటువంటి ఫేక్ కాలేజీలతో జాగ్రత్తగా ఉండాలని విద్యార్థులు, తల్లిదండ్రులను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.
నాలుగు ఫేక్ కాలేజీలు..
రాష్ర్టంలో అనుమతిలేకుండా నాలుగు ఇంజినీరింగ్ కాలేజీలు నడుస్తున్నాయి. ఎప్సెట్ కౌన్సెలింగ్ ప్రారంభం కాకుండానే అడ్మిషన్లు తీసుకుంటున్నాయి. నెక్ట్స్ వేవ్, లీప్స్టార్ట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ సహా మరో రెండు సంస్థలపై విద్యార్థి సంఘాలు ఇటీవలే తెలంగాణ ఉన్నత విద్యామండలికి ఫిర్యాదు చేశాయి.
లీప్స్టార్ట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ పేరుతో ఓ సంస్థ హైదరాబాద్ నగరంలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో నడుస్తున్నది. వాస్తవానికి ఇలా కాలేజ్/స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అని పేరు పెట్టుకోరాదు. కానీ సదరు సంస్థ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలికి ఫిర్యాదులందినట్లు అధికారికవర్గాల ద్వారా సమాచారం.
ఇక నెక్ట్స్ వేవ్ అనే సంస్థ ఏకంగా నానక్రామ్గూడలో క్యాంపస్ తెరిచినట్లు తెలిసింది. ఇవేకాకుండా మరో రెండు ఫేక్ కాలేజీలు సైతం విద్యార్థుల నుంచి అడ్మిషన్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ సంస్థలు కొన్ని డీమ్డ్ వర్సిటీలతో ఒప్పందాలు చేసుకున్నట్లు తెలుస్తున్నది.
ఈ ఒప్పందంలో భాగంగా ఆఫ్ క్యాంపస్లను(బ్రాంచీ) హైదరాబాద్లో తెరిచినట్లు ప్రచారం జరుగుతున్నది. కేవలం కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ), సీఎస్ఈ సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులను మాత్రమే నిర్వహిస్తున్నాయి. వాస్తవానికి ఆఫ్ క్యాంపస్లను తెరవాలంటే అన్ని రకాల అనుమతులు తీసుకోవాల్సిందే.
కానీ ఈ నాలుగు సంస్థలు అనుమతులేవి తీసుకోలేదని అధికారవర్గాల ద్వారా తెలిసింది. ఈ నాలుగు కాలేజీలపై ఫిర్యాదులందడంతో తెలంగాణ ఉన్నత విద్యామండలి చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమవుతున్నది.