04-07-2025 10:30:18 PM
కొత్తపేట ఓజోన్ దవాఖానలో దారుణం
మృతదేహానికి వైద్యం చేశారని మృతుడి కుటుంబ సభ్యులు, బంధువుల ఆరోపణ
ఎల్బీనగర్: వైద్యుల నిర్లక్ష్యంతో ఒక రైతు మృతి చెందిన ఘటన కొత్తపేట లోని ఓజోన్ దవాఖానలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. చనిపోయిన వ్యక్తికి వైద్యం చేశారని మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. వివరాల్లోకి వెళ్తే... సూర్యాపేట జిల్లా పెనుపహాడ్ మండలం అనంతారం గ్రామానికి చెందిన బైరెడ్డి భగవంత్ రెడ్డి (60), భార్య దుర్గమ్మ (50). వృత్తిరీత్యా స్వగ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గత నెల 30వ తేదీన ఒంట్లో నలతగా ఉందని ఎన్టీఆర్ నగర్ లోని ఓజోన్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరాడు. భగవంత్ రెడ్డికి పూర్తిగా వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని సూచించారు.
అందుకుగాను రూ. 8 లక్షలకు ఒప్పందం కుదుర్చుకొని ఈనెల 2వ తేదీన ఉదయం సుమారు 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, రాత్రి 8 నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు రెండు దఫాలుగా ఆపరేషన్లు నిర్వహించినట్లు మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. దాదాపు 20 యూనిట్ల రక్తాన్ని ఎక్కించి, రెండు రోజులుగా ఎవరిని కూడా ప్రత్యేక చికిత్స విభాగానికి పోకుండా అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో బాధిత రైతు కుటుంబ సభ్యుల ఐసీయూలోకి వెళ్లి చూడగా అప్పటికే భగవంత్ రెడ్డి చనిపోయినట్లు నిర్ధారించుకున్నారు. రెండు రోజుల క్రితం చనిపోయిన మృతదేహానికి రక్తం ఎక్కించి తమను మోసం చేశారని మృతుడి కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళన నిర్వహిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న చైతన్యపురి పోలీసులు విచారణ చేస్తున్నారు.