14-09-2025 11:08:20 AM
రోడ్డు ప్రమాదంలో రైతు దుర్మరణం
మరొకరి పరిస్థితి విషమం
మహబూబాబాద్ (విజయక్రాంతి): పొద్దు పొద్దున్నే యూరియా బస్తా టోకెన్ కోసం ద్విచక్ర వాహనంపై ఇద్దరు రైతులు వెళుతుండగా, అతివేగంగా వచ్చిన బొలెరో వాహనం ఢీకొనడంతో ఓ రైతు సంఘటన స్థలంలోనే మరణించగా మరో రైతు పరిస్థితి విషమంగా మారింది. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) గూడూరు మండల కేంద్రంలోనికి సమీపంలో ఆదివారం ఉదయం జరిగింది. గూడూరు మండలం దుబ్బ తండాకు చెందిన ధరావత్ వీరన్న, బానోతు లాల్య ఇద్దరు కలిసి బొద్దుగొండ క్లస్టర్ రైతు వేదిక వద్దకు ద్విచక్ర వాహనంపై టోకెన్ల కోసం వెళ్తున్నారు. ఈ క్రమంలో నర్సంపేట మహబూబాబాద్ జాతీయ రహదారిపై జగన్ నాయకులగూడెం స్టేజీ వద్ద వీరి ద్విచక్ర వాహనాన్ని బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ సంఘటనలో వాల్యా సంఘటనస్థలి లోనే మరణించగా, వీరన్నకు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.