08-08-2025 01:22:32 AM
కొండపాక,ఆగస్టు7: కరెంటు షాక్ తో రైతు మృతి చెందిన ఘటన కొండపాక మండలం సిరిసినగండ్ల గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. సిరిసనగండ్ల గ్రామానికి చెందిన గూడెపు బాపురెడ్డి (64) బుధవారం తెల్లవారుజామున మొక్కజొన్న పంటకు నీళ్లు పారించడానికి వెళ్లాడు. మృతుని భార్య భాగ్యమ్మ ఉదయం ఏడు గంటలకు బావి వద్దకు వెళ్లి తన భర్తను పిలుస్తూ బోరు స్టార్టర్ వద్దకు వెళ్లి చూడగా బాపురెడ్డి కింద పడి తీవ్ర అస్వస్థతకు గురై ఉన్నాడు.
ఆమె తన భర్తను కాపాడడానికి కేకలు వేయగా చుట్టుపక్కల ఉన్న రైతులు బాపురెడ్డి కాలుకు తగిలిన వైరును తప్పించినారు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించే ప్రయత్నంలో పొలం నుంచి రోడ్డుకు వచ్చేలోపే తుది శ్వాస విడిచినట్లు స్థానికులు తెలిపారు. బోరు స్టార్టర్ వద్ద తేలి ఉన్న కరెంటు వైర్ మృతుని కాలుకు తగిలి షాక్ సంభవించిందని మృతుని భార్య భాగ్యమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.