11 April, 2026 | 11:27 PM

మునుగోడులో ఘనంగా రైతు సంఘం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

11-04-2026 09:45 PM

మునుగోడు,(విజయక్రాంతి): 1936లో లక్నోలో చిన్న మొలకగా ప్రారంభమైన కిసాన్ సభ నేడు కోట్లాది మంది రైతుల గొంతుకగా మారి మహావృక్షంలా విస్తరించిందని,కిసాన్ సభ కేవలం ఒక సంఘం కాదని, అది శతాబ్దాల అణచివేతకు వ్యతిరేకంగా వచ్చిన ఒక ఉద్యమమని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బండా శ్రీశైలం పేర్కొన్నారు. మండల కేంద్రంలోని అమరవీరుల స్మారక భవనం వద్ద రైతు సంఘం 90వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆయన హాజరై రైతు సంఘం నాయకులతో కలిసి జెండాను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు.

1757లో జరిగిన ప్లాసీ యుద్ధం తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో పట్టు సాధించడంతో వ్యవసాయ రంగం క్షీణించడం ప్రారంభమైందని ఆయన వివరించారు. బ్రిటిష్ పాలకులు భారతీయ వస్త్ర పరిశ్రమను దెబ్బతీసి, భారీ పన్నులతో స్థానిక ఉత్పత్తులను నెమ్మదిగా నాశనం చేశారని తెలిపారు. దీంతో లక్షలాది మంది చేతివృత్తిదారులు ఉపాధి కోల్పోయి వ్యవసాయంపై ఆధారపడాల్సి వచ్చిందన్నారు.

రైతుల సమస్యలను జాతీయ స్థాయిలో చర్చించేందుకు వామపక్ష, సోషలిస్టు నాయకులు ముందుకు వచ్చి 1936 జనవరిలో మీరట్‌లో జరిగిన సమావేశంతో కిసాన్ సభకు పునాది వేసి, అదే ఏడాది ఏప్రిల్ 11న లక్నోలో అఖిల భారత కిసాన్ సభ ఆవిర్భవించిందని గుర్తు చేశారు.రైతుల హక్కుల కోసం కిసాన్ సభ ఎన్నో పోరాటాలు నిర్వహించిందని, ప్రతి గ్రామంలో ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తూ రైతుల ఐక్యతను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.