26-06-2025 04:23:44 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): ఎంజాయ్ మెంట్ సర్వే ప్రకారం తాము సాగు చేసుకుంటున్న భూములకు పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేసముద్రం తహసిల్దార్ కార్యాలయం ఎదుట నారాయణపురం గ్రామ రైతులు వంటావార్పు కార్యక్రమం నిర్వహించి నిరసన వ్యక్తులు తెలిపారు. 2017లో ధరణి భూప్రక్షాళన సమయంలో తమ గ్రామ రికార్డులను అడవిగా మార్చి రైతుబంధు, రైతు బీమా పథకాలను గత ప్రభుత్వం అమలు చేయకుండా నిర్లక్ష్యం వహించిందని, ఈ విషయంపై అనేక పర్యాయాలు అప్పటి సీఎం కేసిఆర్ దృష్టికి తీసుకువెళ్లగా ఎంజాయ్మెంట్ సర్వేకు ఆదేశించారని, సర్వే ఆధారంగా తమకు పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వడం లేదని గ్రామ మాజీ ఎంపీటీసీ రవి ఆరోపించారు.
తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అడవి అనే పదాన్ని తొలగించి, కొంతమందికి పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వగా, ఇంకా 1000 ఎకరాల భూమికి సంబంధించి పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వడం లేదని, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై గత కొద్ది రోజులుగా వివిధ రకాలుగా తాము నిరసన తెలుపుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడంలేదని ఆయన ఆరోపించారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళన చేస్తున్న రైతులను శాంతింప చేశారు. అనంతరం తహసిల్దార్ వివేక్ కు వినీత్ పత్రం అందజేశారు.