అకాల వర్షంతో అన్నదాత అతలాకుతలం
23-04-2026 12:56 AM
మహబూబాబాద్, ములుగు ఉమ్మడి జిల్లాలో ఈదురుగాలులతో భారీ వర్షం
మహబూబాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): మహబూబాబాద్, ములుగు ఉమ్మడి జిల్లాల్లో బుధవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. ములుగు జిల్లా ఏటురునాగారం, మంగపేట, తాడ్వాయి, మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలో పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.
ఏటునాగారంలో గాలివానకు నిరుపేదలకు చెందిన పలువురి ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. వర్షానికి చేతికందివచ్చిన వరి, మిర్చి, మొక్క జొన్న పంటలు తడిసిపోయాయి. కళ్ళాల్లో ఆరబోసుకున్న పంట ఉత్పత్తులను కాపాడుకోవడానికి రైతులు నానా అవస్థలు పడ్డారు. వరి పంట పలుచోట్ల నేలరాలింది. గాలివానకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకొని పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.






