యూరియా కోసం చెప్పులతో క్యూ లైన్
మొగుళ్లపల్లి మండలకేంద్రంలో రైతుల అవస్థలు.
మొగుళ్ళపల్లి(చిట్యాల)విజయక్రాంతి: పంటలకు కావలసిన యూరియా(Urea) కోసం రైతులు తిప్పలు పడాల్సి వస్తుంది. సీజన్ ప్రారంభమై నెలరోజులు గడుస్తున్నప్పటికీ యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. సహకార సంఘాల(Co-operative Societies) ద్వారా యూరియా పంపిణీ జరుగుతున్నప్పటికీ డిమాండ్ మేరకు సప్లై లేకపోవడంతో రైతులు సొసైటీల వద్ద పడిగాపులు పడుతున్నారు.శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలకేంద్రంలోనీ ప్రాథమిక సొసైటీ కేంద్రం ఆవరణంలో యూరియా పంపిణీ చేస్తుండడంతో అక్కడికి పెద్ద ఎత్తున రైతులు చేరుకొని యూరియా కోసం క్యూ లైన్ కట్టారు.తీవ్రమైన ఉక్కపోత,ఎండ మూలంగా రైతులు లైన్లో నిల్చోలేక పరస్పర అంగీకారంతో చెప్పులను క్యూ లైన్లో పెట్టడం గమనార్హం.వ్యవసాయ పనులు చేసుకోవాల్సిన తాము క్యూ లైన్లలో నిలబడాల్సి రావటం ఎంటని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రైతును రాజును చేస్తామని చెబుతున్న ప్రభుత్వం ఇలా క్యూ లైన్ లో నిలబెట్టి యూరియా కోసం బికార్లను చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు.






