నానో యూరియాపై రైతులకు అవగాహన కల్పించాలి: కలెక్టర్ రాహుల్ శర్మ
02-09-2025 11:25 PM
రేగొండ/భూపాలపల్లి,(విజయక్రాంతి): పంటలకు నానో యూరియా వాడకం పని తీరుపై రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు.మంగళవారం కలెక్టర్ ఐడిఒసి కార్యాలయంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు, ఫెర్టిలైజర్ షాపు యజమానులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. గ్రామస్థాయి నుండి ఫర్టిలైజర్ షాపుల యజమానులు రైతులకు నానో యూరియా వాడకంపై అవగాహన కల్పించాలని నానో యూరియాతో రైతులకు పంట దిగుబడితో పాటు లాభం చేకూరుతుందని ఆయన తెలిపారు. జిల్లాలో యూరియా సరఫరా జరుగుతుందని ఇకముందు రైతులకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించి వ్యవసాయ శాఖ అధికారులు సైతం రైతులకు సైంటిస్టు లతో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు.






