21 April, 2026 | 1:40 AM

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

21-04-2026 12:35 AM

జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ 

సూర్యాపేట, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ లలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. సోమవారం సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ లో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో జిల్లాలో సూర్యాపేట, కోదాడ, తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ లలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.. రాష్ట్ర ప్రభుత్వం క్వింటా రూ.2400 మద్దతు ధర కల్పిస్తుందని, మార్కెట్ లలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో పంటను అమ్మి మద్దతు ధర పొందాలన్నారు..అలాగే ఇతర రాష్ట్రాల నుండి జిల్లాకు ధాన్యం రాకుండా బార్డర్ చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేసి పటిష్ట భద్రత ఏర్పాటు చేశామన్నారు.

జిల్లాలో 340 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, దాదాపు 25 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని వివరించారు. తదుపరి సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ లో రైతుల కోసం హరే రామ, హరే కృష్ణ ఫౌండేషన్ సౌజన్యంతో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రూ.5/- అన్నపూర్ణ భోజనాన్ని ప్రారంభించారు. సీజన్ సమయంలో భోజనంతో పాటు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో టిఫిన్ ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి మార్క్ ఫెడ్ జిల్లా మేనేజర్ బాలకృష్ణ, డి.ఎ.ఓ. శ్రీధర్ రెడ్డి, డి.ఎం.ఓ. నాగేశ్వర శర్మ, డి.సి.ఓ. ప్రవీణ్, ఎ.ఎం.సి.డైరెక్టర్స్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.