13-10-2025 08:42:29 AM
తెల్లవారుజామున అకస్మాత్తుగా విరుచుకుపడిన వర్షం
కల్లాలలో కొట్టుకపోయిన ధాన్యం
కాపాడుకునేందుకు రైతుల ఉరుకులు, పరుగులు
వలిగొండ,(విజయక్రాంతి): గత వారం రోజులుగా రైతులు(Farmers) వరి కోతలు మొదలుపెట్టి తమ ధాన్యాన్ని కల్లాలకు, మార్కెట్ యార్డ్లకు తరలిస్తున్నారు. అయితే సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు వరుణుడు ఒక్కసారిగా ఉగ్రరూపం చూపిస్తూ ఆకాశానికి చిల్లు పడిందా, క్లౌడ్ బరస్ట్ జరిగిందా ఉన్నట్లుగా భారీ వర్షం కురిపించడంతో రైతులు నిండా మునిగారు. తెల్లవారుజామున రైతులంతా తమ తమ ఇళ్లలో గాఢ నిద్రలో ఉండగా ఒక్కసారిగా ఉరుములు, పిడుగులతో కురిసిన భారీ వర్షంతో ఉలిక్కిపడి లేచినప్పటికీ తమ ధాన్యం కుప్పల వద్దకు వెళ్లలేక తమ ఇండ్ల వద్దనే వర్షంలో(heavy rains) తమ కన్నీటిని కార్చుతూ ఉండిపోయారు. భారీ వర్షంతో కల్లాలలో, మార్కెట్ యార్డుల్లో ధాన్యం కొట్టుకుపోగా వర్షం ఆగిపోగానే రైతులు తమ ధాన్యం కుప్పల వద్దకు ఉరుకులు, పరుగులు తీశారు. రైతులు తమ నోటికాడి ముద్దను వరుణుడు నేలపాలు చేశాడని కొట్టుకుపోయిన ధాన్యాన్ని ఒక దగ్గరికి కుప్పలు చేస్తూ కన్నీటిపర్యంతమయ్యారు.