రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి
అబ్దుల్లాపూర్మెట్, ఏప్రిల్ 26: రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం, మంచాల మండలాల పరిధి దండుమైలారం, నోముల గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. రైతు అభివృద్దే రాష్ట్ర అభివృద్ధి అన్న సంకల్పంతో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం రైతులకు పెద్ద ఊరటనివ్వనుందన్నారు.
రైతులు దళారుల మసాలకు గురికాకుండా.. ప్రభుత్వ మద్దతునే నేరుగా ధాన్యం విక్రయించే అవకాశం రైతులకు కల్పించి అండగా ఉంటామని అన్నారు. రైతు లేనిదే రాజ్యం లేదని... రైతు శ్రమకు తగిన గౌరవం దక్కేలా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రతి గింజకు సరైన ధర అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పారదర్శకంగా కొనుగోలు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.






