calender_icon.png 13 August, 2025 | 11:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా వ్యాప్తంగా జ్వర సర్వే పకడ్బందీగా నిర్వహించాలి

11-08-2025 12:41:01 AM

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

కౌడిపల్లి(మెదక్), ఆగస్టు 10 (విజయ క్రాంతి): మూడు రోజు లకు మించి జ్వరంతో బాధ పడుతున్నట్లయితే తక్షణమే దగ్గరలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వైద్యులతో పరీక్షలు చేయించుకోవాలని  జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్  రోగులకు సూచించారు.  ఆదివారం  కౌడిపల్లి మండలం  ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలోని వైద్యులు, సిబ్బంది హాజరు రిజిస్టర్, ఓపి రిజిస్టర్,  ఏఎన్ సీ, ఇన్ పేషెంట్, మందుల స్టాక్ రిజిస్టర్ తదితర రిజిస్టర్ లను పరిశీలించారు.

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా జ్వర సర్వేను నిర్వహించడం జరుగుతున్నదని, అయితే వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు సంభవిస్తున్నాయని, ప్రజలు సీజనల్ వ్యాధుల వల్ల ఇబ్బందులు పడకుండా ఉండేందుకుగాను జ్వరం వచ్చినప్పుడు తక్షణమే డాక్టర్ ను సంప్రదించి చికిత్స చేయించుకోవాలని చెప్పారు. ప్రత్యేకించి మూడు రోజులకు మించి జ్వరం ఉన్నట్లయితే నిర్లక్ష్యం చేయకుండా దగ్గర్లో ఉన్న ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రానికి వచ్చి డాక్టర్ తో చూయించుకోవాలని తెలిపారు.

కౌడిపల్లి మండలంలో నిర్మాణంలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ భవనాన్ని పరిశీలించి, నాణ్యత ప్రమాణాలతో సెప్టెంబర్ నాటికి పనులు పూర్తి చేయాలని సంబంధిత ఈఈని ఆదేశించారు. కౌడిపల్లిలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ను తనిఖీ చేసి, వంటగది, నిల్వ గది నిర్వహణ, శుభ్రత, త్వరగా పాడైపోయే వస్తువుల నాణ్యత మొదలైన వాటిని తనిఖీ చేశారు. నాణ్యమైన మేనూ అందించడంతోపాటు గుణాత్మక విద్య బోధించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.