విష ప్రయోగంతో చేపల మృతి
అచ్చంపేట మే 18: మండల పరిదిలోని లింగోటం చెరువు సమీపంలోని చవటకుంటలో భారీగా చేపలు మృతి చెందడం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. విష ప్రయోగంతో చేపలు మృతి చెందినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. పట్టణం నుంచి వస్తున్న మురుగునీరు కుంటలో కలవడంతో కలుషిత నీటి కారణంగా చేపలు మృత్యువాత పడినట్లు గ్రామ యువకులు ఆరోపించారు.
చేపలు చనిపోయి.. నీళ్లపై తేలడంతో మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణ ప్రాంతంలోని మురుగునీరు చవటకుంటలోకి వెళ్లకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని గ్రామ ప్రజలు, మత్య్సకారులు, యువకులు కోరుతున్నారు.
చవటకుంట కంటే ముందే ఉన్నా మల్లంకుంటలో కూడా మురుగునీరు చేరుతుందని కానీ అక్కడ మాత్రం చనిపోని చేపలు ఈ కుంటలో ఎలా చనిపోతాయని ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై సంబందిత అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేసి వాస్తవాలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనల వల్ల లింగోటం, వలపట్లకాలని యువకుల మధ్య గోడవలు చోటు చేసుకుంటున్నాయని.. అన్నింటిని పరిగణలోకి తీసుకోని విచారణ చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.






