గ్రామాల అభివృద్ధికి కట్టుబడి పని చేస్తున్నాం: ఎమ్మెల్యే జారె, ఎంపీ రఘురామిరెడ్డి
దమ్మపేట/అశ్వారావుపేట,(విజయక్రాంతి): దమ్మపేట మండల పరిధిలోని నాచారం, వడ్లగూడెం, మారప్పగూడెం పంచాయితీ పరిధిలోని పాత చీపురుగూడెం, కొత్త చీపురుగూడెం గ్రామాల్లో అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారె ఆదినారాయణ, ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురామి రెడ్డి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అదేవిధంగా ఆయా గ్రామాల్లోని సీఎంఆర్ఎఫ్ (CMRF) లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ప్రజాప్రతినిధులు చేతుల మీదుగా అందజేశారు.
ముందుగా నాచారం గ్రామంలో 10 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లను, వడ్లగూడెం గ్రామంలో 15 లక్షలతో సీసీ రోడ్లను ప్రారంభించారు. అదేవిధంగా మారప్పగూడెం పంచాయితీ పాత చీపురుగూడెం గ్రామంలో 5 లక్షలతో సీసీ రోడ్డు, కొత్త చిపురుగూడెం గ్రామంలో సీసీ రోడ్లకు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం అశ్వారావుపేట మండల పరిధిలోని నారంవరిగూడెం కాలనీలో 31 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సి సి రోడ్డును ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం అందించే నిధులను సమర్థవంతంగా వినియోగించి గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే దిశగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. ఆపదలో ఉన్న పేద ప్రజలను ఆదుకోవడానికి సీఎంఆర్ఎఫ్ నిధులు ఎంతో దోహదపడతాయన్నారు. అభివృద్ధి పనులు ప్రజలకు అనుకూలంగా ఉండేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.






