21-08-2025 11:11:39 AM
చిన్నారిని చంపి విషం సేవించినట్లు పోలీసుల అనుమానం
శేరిలింగంపల్లి: మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో(Miyapur Police Station) గురువారం దారుణం వెలుగులోకి వచ్చింది. ముక్తమహబూబ్పేటలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతులు కర్ణాటక గుల్బర్గాకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. మృతులు లక్ష్మయ్య(60), భార్య వెంకటమ్మ(55), అల్లుడు అనిల్(40), కూతురు కవిత(38), మనవరాలు అప్పు(2). వీరంతా ఇంట్లో మృతదేహాలుగా పడిఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు.
శవాల పక్కన వాంతులు కనిపించడంతో విషం సేవించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ముందుగా చిన్నారిని హత్య చేసి ఆ తర్వాత మిగతా వారు విషం తీసుకున్నట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలే కారణమై ఉంటాయన్నది పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు, ఘటనకు గల నిజమైన కారణం పోస్టుమార్టం నివేదికతో పాటు దర్యాప్తులో బయటపడనుంది. ఈ దారుణ ఘటనతో ముక్తమహబూబ్పేట ప్రాంతమంతా తీవ్ర విషాదంలో మునిగిపోయింది.