06-12-2025 10:55:45 PM
ఏసీపీ ప్రకాష్..
లక్షెట్టిపేట టౌన్ (విజయక్రాంతి): శాంతియుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ లక్ష్యంగా.. ప్రజల్లో నమ్మకం, భరోసా కల్పించడం కోసమే ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామని మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ అన్నారు. శనివారం సాయంత్రం లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలో పోలీస్ అధికారులతో కలిసి ఫ్లాగ్ మార్చ్ లో పాల్గొన్న అనంతరం ఏసీపీ మాట్లాడారు. రాబోయే పంచాయతీరాజ్ ఎన్నికలు నేపథ్యంలో ఫ్లాగ్ మార్చ్ ప్రజల్లో నమ్మకం పెంపొందించడం, శాంతి భద్రతలు కాపాడడం, ఎన్నికల ప్రక్రియలో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించడం లక్ష్యంగా నిర్వహించడం జరిగిందన్నారు.
ప్రజలందరూ ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించి, ఎన్నికల నియమాలను పాటించి, మీ గ్రామాల్లో చట్ట వ్యతిరేకమైన, అనుమానాస్పద కార్యకలాపాలను వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. ఎన్నికల సమయంలో గందరగోళం సృష్టించడం, బెదిరింపులకు పాల్పడటం, గొడవలకు పాల్పడడం, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన వంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. స్వేచ్ఛాయుత, నిష్పక్షపతంగా, శాంతియుత ఎన్నికలు నిర్వహించడానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో లక్షేట్టిపేట సీఐ రమణ మూర్తి, ఎస్సై గోపతి సురేష్, జన్నారం ఎస్ ఐ అనూష, దండేపల్లి ఎస్ ఐ తైసినోద్దీన్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.