calender_icon.png 9 August, 2025 | 5:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరద నీరు మూసీకి చేరాలి

09-08-2025 01:03:16 AM

  1. భవిష్యత్ వందేండ్లలో భాగ్యనగరంలో వరద నీటి సమస్య రాకూడదు
  2. నీటి ప్రవాహానికి వీలుగా డ్రైనేజీలు, ట్రాఫిక్ చిక్కులు లేకుండా చర్యలు
  3. చెరువులు, కుంటలు, నాలాలు, ఎస్టీపీల ద్వారా మూసీకి అనుసంధానం
  4. అత్యవసర సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడి

హైదరాబాద్, ఆగస్టు 8 (విజయక్రాంతి): ఎంత వర్షం పడినా గ్రేటర్ హైద రాబాద్‌లో వరద నీరంతా నిల్వ ఉండకుండా మూసీ నదికి చేరాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. వరద నీటితో భాగ్యనగరంలోని పలు ప్రాంతాలు ముంపునకు గురవ్వకుండా, లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా సురక్షితంగా ఉండేలా పకడ్బందీ విధానాన్ని అమలు చేయాలని పేర్కొన్నారు. అందుకు మూసీ పునరుజ్జీవనమే సరైన పరిష్కారమవుతుందని అభిప్రాయపడ్డారు.

హైదరా బాద్‌లో 55 కిలోమీటర్ల పొడవునా మూసీ ని పునరుద్ధరించటం ద్వారా పరివాహక ప్రాంతంతో పాటు నగరంలో ఉన్న అన్ని ప్రాంతాలు వరద ముంపునకు గురవకుండా ఉంటాయన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్‌లోని వరదనీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా నగరంలోని అన్ని వైపుల నుంచి వరద నీరు మూసీకి చేరేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

ఢిల్లీ నుంచి శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకున్న సీఎం హైదరాబాద్‌లో గురువా రం రాత్రి కురిసిన వర్షం, తలెత్తిన ఇబ్బందులు, అధిగమించేందుకు అనుసరించా ల్సిన తక్షణ చర్యలపై అధికారులతో తన నివాసంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. అన్ని విభాగాల అధికారుల అభిప్రాయాలు తీసుకున్నారు. ఒకేసారి భారీ వర్షం కురవటంతో విపత్కర పరిస్థితులు తలెత్తడం.. తక్కువ వ్యవధిలో ఎక్కువ వర్షం పడ టంతో జనజీవనం అస్తవ్యస్తమవుతుండటం..

మూడు నాలుగు నెలల్లో కురిసే వర్ష పాతం మొత్తం ఒకే రోజున కుమ్మరించటంతో నగరంలో నెలకొంటున్న పరిస్థితుల పై సమావేశంలో చర్చించారు. వాతావరణ మార్పులే అందుకు ప్రధాన కారణమని, అందుకు తగినట్టుగా నగరంలో అన్ని వ్యవస్థలను ఆధునీకరించాల్సిన అవసరముందని సీఎం అభిప్రాయపడ్డారు.

హైదరాబాద్‌లో ఇప్పుడున్న రోడ్లు, డ్రైనేజీలు అయిదు సెంటీమీటర్ల వర్షం పడితేనే తట్టుకొనే పరిస్థితి లేదని, కాగా ఒక్కోసారి 20 సెంటీమీటర్ల వర్షం నమోదవుతోందని చెప్పారు. ‘హైదరాబాద్‌లో నిన్న రాత్రి కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే కొన్ని ప్రాంతాల్లో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

జూన్ నుంచి ఇప్పటివరకు జీహెచ్‌ఎంసీ పరిధిలో సాధారణంతో పోలిస్తే 16 శాతం వర్షపాతం ఎక్కువగా నమోదైంది. అందుకే వాతావరణ మార్పులు, భారీ వర్షాలతో తలెత్తే ఈ విపత్కర పరిస్థితులను అధిగమించేందుకు విపత్తుల నివారణ నిర్వహణ ప్రణాళిక సమర్థవంతంగా అనుసరించాలి’ ముఖ్యమంత్రి ఆదేశించారు. 

చెరువులు, నాలాలతో మూసీకి అనుసంధానం..

నగరంలో ఉన్న హుస్సేన్ సాగర్, దుర్గం చెరువు, మీర్ అలం చెరువులతో పాటు ప్రతీ చెరువు, కుంటలను నాలాల ద్వారా మూసీకి అనుసంధానం చేయాలని సీఎం సూచించారు. చెరువుల పునరుద్ధరణ, నాలాల వెడ ల్పు ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.

డ్రైనేజీల ద్వా రా వచ్చే నీటిని ఎస్టీపీ (సీవరేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు) ద్వారా శుద్ధి చేసి మూసీలో స్వచ్ఛమైన నీటి ప్రవాహం ఉండేందుకు వీలుగా అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. నగరంలో ఎక్కడ వర్షం పడినా నీరు చెరువు ల్లోకి, నాలాల్లోకి, అటునుంచి మూసీలోకి చేరేలా అనుసంధానం జరగాలన్నారు. 

ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళికలు..

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళి కలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవం త్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వర్షాలు, వరదల సమయంలో ట్రాఫిక్ సమస్య తీవ్రత మరింత పెరుగుతుండటంతో శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా పాతనగరంలో ఈ సమస్యను పరిష్కరించేందుకు పెడస్ట్రియల్ జోన్‌ను ఏర్పాటు చేసి పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టాలని సీఎం సూచించారు.

చార్మినార్, సాలార్ జంగ్ మ్యూజియం, హైకోర్టు, ఉస్మానియా ఆసుపత్రి ప్రాంతాల్లో మల్టీ లెవెల్ పార్కింగ్ జోన్‌లను ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మల్టీ లెవెల్ పార్కింగ్ జోన్‌ల ఏర్పా టుతో రోడ్లపై వాహనాల రద్దీని తగ్గించడంతో పాటు పార్కింగ్ సమస్యకు పరిష్కా రం లభిస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు.

సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎం సెక్రటరీ మాణిక్ రాజ్, హెచ్ ఎండీఏ పరిధిలోని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ సెక్రటరీ ఇలంబర్తి, ఎంఆర్డీసీఎల్ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, జేఎండీ గౌతమి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నా రాయణ రెడ్డి పాల్గొన్నారు.

కలుషిత నీటితో పంటలు.. ప్రజలకు అనారోగ్యం..

మూసీలో స్వచ్ఛమైన నీటి ప్రవాహంతో హైదరాబాద్‌లో నీటి కష్టాలు తీరుతాయని సీఎం అభిప్రాయపడ్డారు. కలుషితమైన నీటితో మూసీ పరివాహక ప్రాంతంలో రైతులు పంటలు పండిస్తున్నారని, ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని అన్నారు.

ఇకపై ఈ పరిస్థితి తలెత్తకుండా మూసీలో నిరంతరం శుద్ధి చేసిన నీటి ప్రవాహం ఉండేలా శాశ్వత ప్రణాళికలు ఉండాలని సీఎం సూచించారు. శుద్ధి చేసిన నీటిని పరిశ్రమలు, ఇతర అవసరాలకు వాటర్ ట్యాంకర్ల ద్వారా వినియోగించుకొనే వీలుంటుందన్నారు. భవిష్యత్‌లో వందేళ్ల పాటు మహానగరంలో వరద నీటి సమస్య పునరావృతం కాకుండా ఉండాలంటే మూసీ పునరుజ్జీవనమే అవసరమని సీఎం అభిప్రాయపడ్డారు.